సిటీబ్యూరో, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం బల్దియాను ఆశ్రయించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో కురిసింది. ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి ట్విట్టర్ వేదికగా నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్నాయని, అత్యవసరమైతేనే బయటకు రావాలని లేదంటే ఇంటికే పరిమితం కావాలని సూచించారు. అత్యవసర సాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నం. 040-21111111, 9000113667 ద్వారా డీఆర్ఎఫ్ బృందాలను ఆశ్రయించాలని కోరారు. అలాగే నగరవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మాన్సూన్ ఎమర్జెన్సీ, ఈవీడీఎం బృందాలు ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆమె ఆదేశించారు.
జోనల్ కమిషనర్లతో డిప్యూటీ మేయర్ టెలి కాన్ఫరెన్స్
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తూ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన రెస్క్యూ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
నీరు నిలవకుండా సహాయక చర్యలు..
నగరవ్యాప్తంగా సగటున 2.9సెం.మీల మేర నమోదైన వర్షపాతంతో పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలు, వాటర్ లాగింగ్ ఏరియాలను పర్యవేక్షిస్తున్న బల్దియా సిబ్బంది… నీరు నిలవకుండా సత్వరమే సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ప్రధాన మార్గాల్లో కొంత మేరకు ట్రాఫిక్ స్తంభించినప్పటికీ… వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సహాయక చర్యల ద్వారా కొద్ది నిమిషాల వ్యవధిలోనే ట్రాఫిక్ యథావిధిగా కొనసాగింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7గంటల వరకు నగరంలో అత్యధిక వర్షపాతం ముషీరాబాద్(4.3సెం.మీ), లంగర్ హౌజ్(4.3సెం.మీ), సరూర్ నగర్లోని మధురానగర్ (4.0సెం.మీ), చందానగర్లోని జేపీఎన్ నగర్పరిధిలో(3.8సెం.మీ), ఎల్బీనగర్(3.7సెం.మీ), సైదాబాద్లోని కుర్మాగూడ(3.7సెం.మీ), నాంపల్లిలో (3.6సెం.మీ), సికింద్రాబాద్(3.5సెం.మీ), చార్మినార్(3.5సెం.మీ), షేక్పేట్(3.2సెం.మీ), చిలుకలగూడ(3.1సెం.మీ), ఆసిఫ్ నగర్, మోండా మార్కెట్, బహదూర్పురా, మారేడ్పల్లి, ఉప్పల్, ఖైరతాబాద్, అంబర్పేట్ వంటి, కూకట్ పల్లి, హిమయత్ నగర్, పటాన్ చెరు, బాలానగర్, శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.