శామీర్ పేట, మార్చి 1 : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మురహరిపల్లి 13వ వార్డులో ఉన్న పోచమ్మ కుంట ఇండస్ట్రియల్ కెమికల్ వ్యర్థ జలాలతో కలుషితమవుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సమీప పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థ జలాలను అర్ధరాత్రి వేళల్లో రహస్యంగా కుంటలోకి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు మంచినీటి వనరుగా పేరుగాంచిన ఈ కుంట పక్షులు, జంతువులకు జీవనాధారంగా ఉండేదని, ప్రస్తుతం నీటి రంగు మారి దుర్వాసన వస్తుందని చెబుతున్నారు.
మురహరిపల్లి చెరువు నుంచి బందనుకుంట, పోచమ్మ కుంటల వరకు జలమార్గాలు కలుషితం కావడంతో పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత జలాల ప్రభావంతో అపార్ట్మెంట్లలో నివసించే ప్రజలు చర్మవ్యాధులు, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురొంటున్నారని తెలిపారు. పశువులు, పక్షులు ఈ నీటిని తాగి మృత్యువాత పడుతున్నాయని వాపోయారు. పరిశ్రమలు పర్యావరణ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికకు ఆనుకొని ఉండడంతో ఖనన కార్యక్రమాలకు వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా పోచమ్మ కుంట మారింది.
కఠిన చర్యలు తీసుకోవాలి
మంచినీటి కుంటగా పేరొందిన పోచమ్మ కుంట నేడు విషపూరిత వ్యర్థజలాలతో మనుషులు, జంతువులు, పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారిందని కౌన్సిలర్ యూసుఫ్ బాబా ఆవేదన వ్యక్తం చేశారు. కుంటను కలుషితం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసు, కాలుష్య నియంత్రణ, మున్సిపల్ అధికారులను కోరారు. పోచమ్మ కుంటను శుద్ధి చేసి, భూగర్భ జలాల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
-యూసుఫ్ బాబా, బీఆర్ఎస్ కౌన్సిలర్
సీసీ కెమెరాలతో నిఘా
పోచమ్మ కుంట పరిసర ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో వ్యర్థజలాలు విడుదల చేస్తున్న వారిని గుర్తిస్తామని అలియాబాద్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆధారాలతో సహా పట్టుకుని బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని పేరొన్నారు.
– చంద్రశేఖర్, అలియాబాద్ మున్సిపల్ కమిషనర్