నాలుగు డివిజన్లు,112 కాలనీలు
పాల్గొననున్న 44 మంది సూపర్ వైజర్లు,
839 మంది పారిశుద్ధ్య సిబ్బంది
ఖైరతాబాద్, మే 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వనగరాభివృద్ధిలో భాగంగా జూన్ 3 నుంచి 18 వరకు ఈ బృహత్తర కార్యక్రామన్ని జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లు, కాలనీల్లో నిర్వహిస్తారు. పట్టణ ప్రగతిని విజయవంతం నిర్వహించేందుకు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రణాళికలు సిద్ధం
పారిశుద్ధ్యం….పార్కుల అభివృద్ధి…పచ్చదనం పెంపు సర్కిల్ -17 పరిధిలోని ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్నగర్ డివిజన్లలో మొత్తం 112 కాలనీలు ఉన్నాయి. నాలుగు డివిజన్లకు నలుగురు డీఈ, ఏఈ స్థాయిల అధికారులు ఉంటారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్కిల్ పరిధిలోని కాలనీల్లో పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్యం నిర్వహణ, పచ్చదనం పెంపొందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ సర్కిల్లో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, 44 మంది శానిటరీ సూపర్వైజర్లు 839 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తారు. తడి, పొడి చెత్త నిర్వహణ, కాలనీల్లో పారిశుద్ధ్యం, అవసరమైన చోట హరితహారం ద్వారా పచ్చదనం పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.
జూన్ 3 నుంచి ..
ప్రభుత్వం జూన్ 3 18 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నది. జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయి. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. – డాక్టర్ భార్గవ్ నారాయణ, ఏఎంవోహెచ్, సర్కిల్ 17