ఖైరతాబాద్, నవంబర్ 25: ఫోన్ సహాయంతో ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా..! అయితే, గూగుల్ పే, ఫోన్ పేకు తప్పనిసరిగా పాస్వర్డ్ పెట్టండి. పాస్వర్డ్ అంకెలను రహస్యంగా ఉంచండి. నిర్లక్ష్యం చేస్తే ఇతరులెవరైనా మీ ఫోన్ నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.. ఇందుకు ఈ సంఘటనే నిదర్శనం. పంజాగుట్ట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన పి.వీరప్రతాప్ ఈనెల 23న వ్యక్తిగత పనులపై నగరానికి వచ్చాడు.
సికింద్రాబాద్కు వెళ్లేందుకు ఈఎస్ఐ దవాఖాన వద్ద ఓ ఆటోను మాట్లాడుకొని, ముందు సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. పంజాగుట్ట క్రాస్రోడ్స్ వద్దకు రాగానే హడావుడిగా డ్రైవర్ ఆటోను ఆపాడు. వీరప్రతాప్ను ఆటో నుంచి దిగమని చెప్పాడు. ఎందుకని ప్రశ్నించేలోపే అక్కడి నుంచి డ్రైవర్ ఉడాయించాడు. ఆ తర్వాత వీరప్రతాప్ తన జేబులో చూసుకోగా సెల్ఫోన్ కనిపించలేదు. చేసేదేమీ లేక.. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. స్వగ్రామానికి వెళ్లిన వీరప్రతాప్.. ఏటీఎం సెంటర్కు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఖాతాలో డబ్బులు లేవు. సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించగా.. గూగుల్, ఫోన్ పే ద్వారా రూ.57,362 వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాస్వర్డ్ ఉండాలి..
సెల్ఫోన్ సహాయంతో ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారా..! తప్పనిసరిగా గూగుల్ పే, ఫోన్ పేకు పాస్వర్డ్ ఉండాలి.. ఆ పాస్వర్డ్ ఇతరులకు చెప్పవద్దని, రహస్యంగా ఉంచాలని పంజాగుట్ట ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. ఫోన్లు చోరీకి గురైనా, ఇతరులు తీసుకున్నా.. సరైన పాస్వర్డ్ లేకపోవడంతో ఆ ఫోన్ ద్వారా సులభంగా బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తారని తెలిపారు. మంచిర్యాల బాధితుడి విషయంలో ఇదే జరిగిందని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. కొంతమంది పాస్వర్డ్ పెట్టుకుంటున్నారు. కానీ, ఆ నాలుగు అంకెలను రహస్యంగా ఉంచకుండా, గూగుల్ పే, ఫోన్ పే పాస్వర్డ్ అంటూ ప్రత్యేకంగా టైప్ చేసి మొబైల్లో ఉంచు తున్నారని చెప్పారు. ఇది క్షేమం కాదన్నారు. సాంకేతికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోసానికి గురికారని తెలిపారు.