బంజారాహిల్స్, జూన్ 28: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన హెచ్ సిటీ ఫ్లైఓవర్ల ప్రాజెక్టు పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సహా ట్రాఫిక్ ఉన్నతాధికారులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. బంజారాహిల్స్లోని పార్క్ హయత్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దాకా పనులు జరుగుతుండడంతో అయా ప్రాంతాల్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు వన్వే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందో చూసేందుకు ఆదివారం ట్రయల్ రన్ సైతం నిర్వహించినా సత్ఫలితాలు రాలేదు. ఏదో రకంగా వాహనదారుల కష్టాలు తీర్చాలనే లక్ష్యంతో పోలీసుశాఖ పనిచేస్తోంది. అయితే వారికి సహకరించాల్సిన జీహెచ్ఎంసీ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ప్రధాన రహదారులపై చిన్న చిన్న మరమ్మతులు, ఫుట్పాత్ల తొలగింపు, రోడ్డుపై గుంతలు పూడ్చడం ద్వారా ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడాల్సిన జీహెచ్ఎంసీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

