Cyber Crime | సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రివ్యూస్ రాయాలంటూ.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట నగరానికి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. డ్రీమ్ డెవలప్మెంట్ పేరుతో రూపొందించిన గ్రూప్లో పార్ట్టైమ్ ఉద్యోగాల గురించి తొలుత చర్చించారు. హోటల్స్ ప్రమోట్ చేయడంలో భాగంగా రివ్యూస్ రాయాలంటూ నమ్మించారు. ఆ మాటలు నమ్మిన బాధితుడు.. వాళ్లు చెప్పినట్లు చేశాడు. మొదట కొన్ని హోటళ్ల పేర్లు ఇచ్చి.. వాటికి రివ్యూస్ రాయమని చెప్పారు. ఒక సెట్లో 30 హోటళ్ల పేర్లుంటాయి. ఇలా ఒక సెట్ పూర్తి చేస్తే వెయ్యి రూపాయలంటూ.. నమ్మించారు.
మొదట బాధితుడికి రూ. 1000 మూడు సెట్ల వరకు మూడు వేలు ఇచ్చారు. ఆ తరువాత మీరు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ బాధితుడితో మొదట రూ. 25 వేలు, ఆ తరువాత రూ. 50 వేలు డిపాజిట్ చేయించారు. లాభాలొస్తున్నాయంటూ స్క్రీన్పై చూపిస్తూ.. మొత్తంగా రూ.13,57,288 దోచేశారు. ఈ ఘటనపై బాధితుడిచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.