సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును శనివారం రాత్రి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ గృహ,పట్టణ వ్యవహారాల ప్రతినిధి రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలో 14 మంది సభ్యుల బృందం రాయదుర్గం నుంచి అమీర్పేట వరకు మెట్రో రైలులో ప్రయాణం చేసి, ప్రాజెక్టును ప్రత్యేకంగా పరిశీలించారు. హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రతినిధుల బృందానికి మెట్రో ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుగా నిలిచిందని తెలిపారు. ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతూ అమీర్పేట ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లో షాపింగ్ కేంద్రాలను ప్రతినిధుల బృందానికి చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును చేపడుతోందని ఆయన వివరించారు. మెట్రో రైలు ప్రాజెక్టును సందర్శించిన వారిలో గిరిరాజన్, రామ్చందర్ జాంగ్రా,కవితా పటీదార్, బెన్నీ బెహనన్, శంకర్ లాల్వానీ, హస్నైన్ మసూది ఉన్నారు.