పహాడీషరీఫ్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనదిగా ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మకమైన బాబా షర్ఫుద్దీన్ దర్గా 755వ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సందెల్ కార్యక్రమం నిర్వహించారు. బాలాపూర్ గ్రామంలోని బాబా షర్ఫుద్దీన్ నివాసం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి సందెల్ ఊరేగింపు ప్రారంభమైంది. కొత్తపేట, వెంకటాపూర్, బిస్మిల్లాకాలనీ, షాహీన్నగర్ మీదుగా జల్పల్లి కమాన్ ప్రాంతంలో ఉన్న శక్కర్ షా వలీ దర్గా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఫజర్ నమాజ్ నిర్వహించిన అనంతరం పహాడీషరీఫ్ బాబా షర్ఫుద్దీన్ మందిరానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సందెల్ సమర్పించారు.
కులాలకు, మతాలకు అతీతంగా భక్తులు ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు మొయినొద్దీన్, ఇమ్రాన్, సలీం, అలీమొద్దీన్, జహంగీర్పాష, ఇర్ఫాన్, కౌన్సిలర్ ఖాలెద్ బిన్ అబ్దు ల్లా, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్లా, కొండల్ యాదవ్, విశాల్గౌడ్, ఎంఐఎం నాయకులు దస్తగిర్, సైయ్యద్ అహ్మద్, స్థానికులు శ్రీధర్, సయ్యద్ సలీం తదితరులు పాల్గొన్నారు.