ఉపాధ్యాయుడి నుంచి ఉన్నతాధికారిగా ఎదిగిన పద్మశ్రీ డాక్టర్ టీవీ నారాయణ
బాల్య దశలో తండ్రిని కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు..
సుల్తాన్ బజార్, జనవరి 11: అసాధ్యం అనే పదం ఎంత మాత్రం ఈయన దరిదాపులకు కూడా రాలేదు. అలాంటి దానిని సాధించి చూపించిన మహోన్నతుడు, సరస్వతీ పుత్రుడు టీవీ నారాయణ అనారోగ్యంతో మరణించారు. సాధారణ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితా న్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ సభ్యుడి వరకు ఎదిగిన అతి సామాన్యుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ తక్కెళ్ల వెంకయ్య నారాయణ (97) మంగళవారం తనువు చాలించారు. కొన్నేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్ కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్న నారాయణ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1925 జూలై 26న అతి సామాన్య దళిత నిరుపేద కుటుంబంలో బొల్లారంలో నర్సమాంబ, వెంకటయ్య దంపతులకు తొలుసూరుగా టీవీ నారాయణ జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో నిరంతరం శ్రమనే నమ్ముకొని ఉన్నత విద్యావేత్తగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో రచనలు చేశారు. ఆర్య సమాజ్ సాయంతో అంటరాని వర్గాలకు విద్యనందించేందుకు విశేషంగా కృషి చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు తమిళం, సంస్కృతంలో ప్రావీణ్యం ఉంది. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా చదువును ఆపకుండా కొనసాగించారు. అత్యధికంగా శ్మశానంలోనే విద్యను కొనసాగించారని తన మిత్రులు తెలిపారు.
తన తమ్ముళ్లకు తండ్రి లేని లోటు తెలియకుండా గ్రూప్-1 అధికారులుగా తీర్చిదిద్దారు. 1941 నుంచి 45 మధ్య కాలంలో బొల్లారం నుంచి సికింద్రాబాద్ వరకు రైలులో వచ్చి సికింద్రాబాద్ నుంచి నిజాం కళాశాల వరకు నిత్యం నడుచుకుంటూ వచ్చి విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1946లో తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న ప్రభుత్వ పాఠశాలలోనే తాత్కాలిక ఉపాధ్యాయుడిగా నాలుగు నెలల పాటు సేవలందించారు. రూ.48ల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూనే.. ఎంఏ, ఎంఎడ్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, డీలిట్ విద్యను పూర్తి చేశారు. తదనంతరం హైదరాబాద్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్, జిల్లా విద్యాశాఖాధికారిగా, ఏపీ ప్రాథమిక విద్యా శాఖ ఉప సంచాలకులుగా పని చేశారు. సిటీ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న సమయంలో టీవీ నారాయణ సిడ్నీ హారీస్ రాసిన పద్యం ‘వర్క్వర్క్వర్క్’ ఎందరినో ఆలోచింపజేసిందని ఆయన సహచరులు పేర్కొన్నారు. 1974లో ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుడిగా సేవలందించారు. ఎన్నో ఉన్నత విద్యా సంస్థలకు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా, ఉమ్మడి ఏపీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ తొలి సభ్యుడిగా సేవలందించారు.
శిష్యురాలినే వివాహమాడిన టీవీ..
బొల్లారంలోని ఆర్య సమాజ్లో ట్యూషన్ చెప్పే సమయంలో అక్కడికి చదువుకునేందుకు వచ్చే సదాలక్ష్మితో టీవీ నారాయణకు పరిచయం పెరిగింది. దీంతో ఆర్య సమాజ్లోనే కులాంతర వివాహం చేసుకున్నారు. నారాయణకు ముగ్గురు సంతానం. గాయత్రి, మంజుల కుమార్తెలు, కొడుకు వంశీ తిలక్ వైద్య వృత్తిలో ఉన్నారు. సదాలక్ష్మి ఎమ్మెల్యే, మంత్రిగా, శాసన సభ డిప్యూటీ స్పీకర్గా అనేక పదవులు చేపట్టారు.