సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులు మహిళలకు నరకం చూపుతున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో మహిళా ప్రయాణికులకు అవస్థలు మొదలయ్యాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత సుమారు వెయ్యికి పైగా కాలం చెల్లిన సిటీ బస్సులను రోడ్డెక్కించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నాలుగువేల సిటీ బస్సులు అవసరం
నగరంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కోసం నగర ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. గతంలో ఆటోలు, సొంత వాహనాలు, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలతో ప్రయాణం చేసే వారంతా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్క సారిగా సిటీ బస్సులు పూర్తి స్థాయిలో నిండుతున్నాయి. నగరంలో మొత్తం 29 డిపోలు ఉండగా వాటిలో మూడు నుంచి నాలుగు డిపోలకు చెందిన బస్సులలో వంద శాతానికి మించి ఆక్యుపెన్సీ నమోదవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి పథకాన్ని నగరంలో సమర్థవంతంగా అమలు చేయాలంటే.. ఇప్పుడున్న బస్సులు ఏ మాత్రం సరిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నగర ప్రయాణికుల అవసరాల కోసం దాదాపు 4000 సిటీ బస్సుల అవసరం ఉంటుందన్న అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తిరుగుతున్న 2700 బస్సులలో వెయ్యి వరకు కాలం చెల్లిన తుక్కు బస్సులే ఉండగా.. నగర ప్రయాణికుల అవసరాల కోసం మరో 1300 కొత్త బస్సులు అవసరం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు.
మహాలక్ష్మికి బస్సులు కరువు
మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఆర్టీసీ బస్సులకు మంచి ఆదరణ పెరిగింది. కానీ ఉచిత ప్రయాణం కోసం వచ్చే మహిళా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని నగరంలో ఆదనంగా సిటీ బస్సులను ఏర్పాటు చేయడం లేదు. ఈ పథకం అమలు చేయకముందు వరకు మొత్తం 2700 బస్సులు అందుబాటులో ఉండగా.. అందులో 1000 వరకు మెట్రో ఎక్స్ప్రెస్లు కాగా.. 1700 వరకు ఆర్డినరీ బస్సులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇందులో దాదాపు 1300 సిటీ బస్సులు కాలం చెల్లినవిగా అధికారులు పేర్కొంటున్నారు. 15 సంవత్సరాలు దాటిన బస్సులను నిబంధనల ప్రకారం తక్కుగా పరిగణించి షెడ్డుకు పంపిస్తారు. కానీ వీటితోనే ఆర్టీసీ కాలం వెల్లదీస్తుండగా.. వీటితో ప్రమాదం పొంచిఉన్నదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.