సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్/ అడ్డగుట్ట : ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా నలు దిశాలకు వ్యాపించిందని, ఉత్తమ స్థానాల్లో వర్సిటీ పూర్వ విద్యార్థులు ఉన్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. ఓయూ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ‘ఉస్మానియా తక్ష్-2022’ ఫెస్ట్ సందర్భంగా రెండోరోజు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో 300 మందికిపైగా పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. గొప్ప చరిత్ర కలిగిన ఓయూకి ఈ సారి బడ్జెట్లో 50 శాతం నిధులు అధికంగా కేటాయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, కాకతీయ వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కిషన్రావు, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంవీ కృష్ణారావు, ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఓయూ తక్ష్ కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. వర్సిటీ ఔన్నత్యాన్ని చాటేవిధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అలరిస్తున్నాయి. శుక్రవారం కళాశాలలోని పలు విభాగాలు పూర్వ విద్యార్థులతో సదస్సులు, సమావేశాలు నిర్వహించి, అప్యాయతను పంచుకున్నారు. ఎడ్యుకేషన్, సోషియాలజీ, జాగ్రఫీ డిపార్ట్మెంట్ విభాగాల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి చిరంజీవులు హాజరయ్యారు. కాగా, ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో మరమ్మతులు, మైనింగ్ ఇంజినీరింగ్ తరగతి గదుల కోసం పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్కుమార్ రూ.10 లక్షల విరాళాన్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరామ్వెంకటేశ్కు అందజేశారు. మరోవైపు ఆర్ట్స్ కళాశాలకు విద్యుత్ వెలుగులతో అందంగా అలంకరించగా, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ.. సందడిగా గడిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వీసీ ప్రొ. దండబోయిన రవీందర్ యాదవ్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొ.రెడ్యానాయక్, ఓయూ ఆర్ట్స్కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.చింత గణేశ్ పూర్వవిద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. శనివారం ముగింపు సందర్భంగా ల్యాండ్స్కేప్ గార్డెన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.