బంజారాహిల్స్, జనవరి 30: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. పదిరోజుల పాటు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు ఫీవర్ సర్వే ప్రారంభమైన తర్వాత రోజురోజుకూ తగ్గిపోతున్నట్లు గణంకాల ద్వారా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ సర్కిల్ 17, సర్కిల్- 18 పరిధిలో పదిరోజులుగా చేపట్టిన జ్వర సర్వేలో సుమారు 70వేల ఇండ్లలో జ్వర లక్షణాలు ఉన్నవారి వివరాలను వైద్య సిబ్బంది సేకరించారు. ఈ సర్వేలో 110 బృందాలు పాల్గొంటున్నాయి. సుమారు 10వేల మంది జ్వరం, జలుబు తదితర లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో తేలడంతో అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్స్ అందజేశారు. దీంతో పాటు కేవలం జ్వరం మాత్రమే ఉన్నవారికి టాబ్లెట్స్ అందించడంతో రెండుమూడు రోజుల్లోనే తగ్గిపోతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తొమ్మిదిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోందని గణంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి 21న నియోజకవర్గంలోని 6 కొవిడ్ పరీక్ష కేంద్రాల్లో 781మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోగా ..వారిలో 181మందికి పాజిటివ్ వచ్చింది. జనవరి 21న పాజిటివిటీ రేటు 23శాతంగా నమోదైంది. కాగా.. జ్వర సర్వే ప్రారంభం కావడంతో క్రమక్రమంగా పాజిటివిటీ రేటు తగ్గిపోతున్నది. ఆదివారం నియోజకవర్గంలో పాజిటివిటీ రేటు కేవలం 3 శాతానికి తగ్గిపోవడం విశేషం. ఆదివారం మొత్తం 285 మందికి పరీక్షలు చేయగా వారిలో 9 మందికి మాత్రమే పాజిటివ్గా తేలింది. పంజాగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరుసగా మూడోరోజూ జీరో కేసులు నమోదవడం గమనార్హం. బంజారాహిల్స్, చింతల్బస్తీ, ఫిలింనగర్ కేంద్రాల్లో కేసుల సంఖ్య భాగా తగ్గిపోయింది. కరోనా హాట్స్పాట్గా మారిన షౌకత్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కూడా కేసులు అదుపులోకి వస్తున్నాయి. వారం క్రితం రోజుకు 40నుంచి 50కేసులు నమోదయ్యేవి. కాగా రెండురోజుల్లో ఇక్కడ కేవలం రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవడం గమనార్హం. వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటికీ వెళ్తూ జ్వర కిట్స్ అందించడంతో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.