మియాపూర్ : నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే ధ్యేయంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులు సమకూర్చుకుంటూ తగు సౌకర్యాలను అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన తెలిపారు.
మౌలిక వసతుల కల్పనలో ప్రతి డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ పేజ్ 1లో రూ. 42 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డివైడర్ పనులకు కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి నిర్మాణ పనులలో ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని, జాప్యానికి ఆస్కారం ఉండకుండా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అన్ని డివిజన్లలో రహదారులు, డైనేజీలు, తాగునీరు, విద్యుత్ సహా ఇతర అన్ని మౌలిక వసతులను కల్పించే ప్రాధాన్యతతో ముందుకు సాగుతున్నామన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, ప్రజల ద్వారా స్థానిక అవసరాలను తెలుసుకుంటూ తగు పనులతో సమస్యల పరిష్కారం….కాలనీల పురోగతి చర్యలు తీసుకుంటున్నామని గాంధీ తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే సీసీ దారుల నిర్మాణాన్ని సింహభాగం పూర్తి చేసినట్లు , ఇంకా అవసరమున్న చోట్ల చేపడుతున్నామన్నారు . కాలనీలకు ఎల్లవేళలా తన తోడ్పాటును అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంఘం ప్రతినిధులు సైదేశ్వర్, రామలింగేశ్వర్రావు , ప్రకాశ్, నాగిరెడ్డి, కృష్ణకుమారి, ప్రసాద్, శ్రీనివాస్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.