OU Degree Exams | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను తక్షణమే వాయిదా వేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీపీజీఎంఏ) డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో తాము కళాశాలలు నడిపించే పరిస్థితుల్లో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పరీక్షలు సైతం నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమకు నాలుగేళ్లుగా ఫీజు బకాయిలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని, ఆర్టీఎఫ్ ద్వారా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని గతంలో చెప్పారని గుర్తు చేశారు. దానిని అనుసరించి విద్యార్థులకు ఉత్తమ బోధన గావిస్తూ అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తాము బతుకుతూ తమతోపాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న యాజమాన్యాలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వివరించారు. భవన యజమానుల అద్దె వేధింపులు, వేతనాల కొరకై ఉద్యోగుల ఒత్తిడి, వారి సహాయ నిరాకరణ ఇవన్నీ కాకుండా రోజువారి ఖర్చులకు మరింత సొమ్ము అవసరం పడడంతో ఎంతో కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. గతేడాది మార్చి నుంచి ఎన్నో పర్యాయాలు అధికారులు, నాయకులకు తమ గూడు వెళ్ళబోసుకున్నప్పటికీ ఫలితం రాలేదని చెప్పారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో దసరా సెలవుల అనంతరం (అక్టోబరు 14 నుంచి) యాజమాన్యాలు కళాశాలలను తెరవలేకపోయారని పేర్కొన్నారు. దాంతో అదే నెల17న పేరుకు కొన్ని బకాయిలను విడుదల చేశారని అన్నారు. కనీసం 20 శాతం బకాయిలు కూడా విడుదల చేయకుండా కళాశాలలు ఎలా నడపాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని చెప్పారు. అందుకే కొన్ని రోజులు పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.