ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 30 : విద్యారంగంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా మరో గుర్తింపు పొందింది. 2022 సంవత్సరానికి గాను దేశంలో ‘బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్’ అవార్డును ఓయూ సాధించింది. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసిన ‘ది ఎకానమిక్ టైమ్స్’ ఈ అవార్డులను ప్రకటించింది.
ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను అందజేశారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) చైర్మెన్ కేకే అగర్వాల్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మెన్ డాక్టర్ అనిల్ సహస్రబుద్ధి వంటి ప్రముఖుల సమక్షంలో అసోం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు చేతుల మీదుగా ఈ అవార్డును ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం స్వీకరించారు.
ఓయూకు అవార్డు రావడం పట్ల వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా ఓయూను పటిష్టపరిచే దిశగా ముందుకుసాగుతున్నామని చెప్పారు.