హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల దందా తాజాగా వెలుగుచూసింది. నకిలీ సర్టిఫికెట్ల బాగోతంపై ఓయూ విద్యార్థి నాయకులు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు ఫిర్యాదు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తీసుకొని ముద్దం స్వామి అనే వ్యక్తి యూఎస్లో ఉన్నత చదువులు చదువుతున్నాడని విద్యార్థి నాయకులు సీపీకి తెలిపారు. కన్సల్టేషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అడ్డాగా ఈ దందా సాగుతోందన్నారు. ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను కూడా సీపీకి విద్యార్థి నేతలు అందించారు.
ఇలా ఎంతమంది నకిలీ సర్టిఫికెట్స్ పొందారో సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘం నాయకులు సీపీని కోరారు. చాలామంది ఈ నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారని.. ఈ వ్యవహారం వెనుక ఉస్మానియా అధికారుల పాత్ర ఉందా? అనే కోణంలో విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని.. ఫేక్ సర్టిఫికెట్తో యూఎస్ వెళ్లిన స్వామిని పది రోజుల్లో అదుపులో తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు.