ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 30: ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెచ్చేందుకు 21 అంశాలతో ముందుకు సాగుతామని ఓయూ నూతన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ స్పష్టం చేశారు. నూతన సంస్కరణలు అమలు చేసి వర్సిటీ ప్రతిష్టను పెంచి అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. ఓయూలోని గెస్ట్హౌస్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో యూజీ, పీజీ కోర్సులను సమీక్షించి, విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. యూజీసీ కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తితో నూతన కోర్సులు ప్రవేశపెట్టే వీలుందని గుర్తు చేశారు. ఇప్పటికీ ఓయూలో సాంప్రదాయ కోర్సులే ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నూతన కోర్సుల రూపకల్పనకు చర్చలు జరుగుతున్నాయన్నారు. పరిశోధనలకు సరికొత్త రూపు తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయగా కొంత గ్యాప్ ఏర్పడిందని.. దాన్ని పూడ్చేందుకు అడ్జంక్ట్ ప్రొఫెసర్ పేరుతో వారిని తిరిగి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. ఓయూ సీఎఫ్ఆర్డీలో ఉన్న అనేక పరికరాలను అందరూ వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఓయూలో జరిగే పరిశోధనలను సమాజం, ప్రభుత్వం, నిధులు మంజూరు చేసే సంస్థలకు తెలిసేలా ఓపెన్ హౌస్, ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ శిక్షణా కార్యక్రమాలను అమలు చేయనున్నామని అన్నారు. ప్రత్యేకించి ఇంగ్లిష్పై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. స్టూడెంట్ సర్వీసెస్లో ఐసీటీ వినియోగాన్ని పెంచుతామన్నారు. విద్యార్థులకు యూనిక్ ఐడీ నెంబర్ ఇచ్చి దానిని ఆధార్కు అనుసంధానం చేసి, తరగతి, హాస్టల్, మెస్, లైబ్రరీ, పరీక్షలు ఇలా అన్ని చోట్ల వినియోగించేలా చూస్తామని వివరించారు.
నూతన హాస్టళ్ల నిర్మాణానికి కృషి చేస్తామని, వినియోగంలో లేని వాటిని కూల్చివేస్తామని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ సంస్థల సహకారం తీసుకుని వర్సిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు. పూర్వ విద్యార్థుల సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. నిధులను ఖర్చు చేయడంలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు పలు సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు. శతాబ్ధి స్మారకంతో పాటు సెంటెనరీ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ నిర్మాణాన్ని చేపడతామన్నారు. క్లోజ్డ్ క్యాంపస్గా ఓయూను తీర్చిదిద్దేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. వర్సిటీ స్థలాల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, పీఆర్ అడ్వైజర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, పీఆర్వో డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.