ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 26: ద ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ ఇంజినీర్స్ – ఇండియా (ఐఈటీఈ) హైదరాబాద్ కేంద్రం ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జ్ఞానేశ్వర్రావు మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ నిపుణులకు సంబంధించి ఐఈటీఈ పెద్ద ప్రొఫెషనల్ సంస్థ అని చెప్పారు. దేశంలో దాదాపు 70కి పైగా నగరాలలో ఐఈటీఈకి కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ కేంద్రాల తరపున వర్క్షాప్లు, శిక్షణ కోర్సులు, పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు, స్మారక ఉపన్యాసాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాదికి గాను దేశంలో ఉత్తమ కేంద్రం అవార్డును హైదరాబాద్ కేంద్రమే దక్కించుకుందని చెప్పారు.
ఈ అవార్డును ఐఈటీఈ, న్యూఢిల్లీ కార్యాలయం తరపున ఐఈటీఈ విశిష్ట సహచరుడు ప్రొఫెసర్ బీఎల్ దీక్షితులు చేతుల మీదుగా జ్ఞానేశ్వర్ స్వీకరించారు. అనంతరం, ఉత్తమ ఐఈటీఈ స్టూడెంట్ ఫోరం కేంద్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులను వరుసగా విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారత్ ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాల దక్కించుకున్నాయి. ఐఈటీఈ స్టూడెంట్ ఫోరం ఉత్తమ కో ఆర్డినేటర్లుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సీవీ కీర్తిలత, వై. రాకేశ్ కుమార్, ఎన్.అబిద్ అలీఖాన్ నిలిచి, అవార్డులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐఈటీఈ, న్యూఢిల్లీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రభాకర్, మాజీ అధ్యక్షులు డాక్టర్ టి.హనుమాన్ చౌదరి, ప్రొఫెసర్ ఎస్.నారాయణ, మాతృశ్రీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కేపీ శ్రీనివాసరావు, ఐఈటీఈ హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి నూల నమశ్శివాయలు పాల్గొన్నారు.