సిటీబ్యూరో, సుల్తాన్బజార్ జూలై 22 (నమస్తే తెలంగాణ): ఉస్మానియాలో మరింత మెరుగైన వైద్యం అందనున్నది. మరో అత్యాధునిక ఐసీయూ అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే తెలుగు రాష్ర్టాల్లోనే ఎక్కడా లేని విధంగా స్కిన్బ్యాంక్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించేందుకు మరో నూతన ఐసీయూ సిద్ధమైంది. ఈ దవాఖానలో నిత్యం 2000 మందికి పైగా ఓపీ, 1500 నుంచి 1800 మంది వరకు ఐపీ సేవలు పొందుతుంటారు. వీరిలో 200 నుంచి 300 మంది వరకు వివిధ విభాగాల్లోని ఐసీయూ వార్డుల్లో చికిత్స పొందుతారు.
ప్రస్తుతం 290 పడకల సామర్ధ్యం గల ఐసీయూ వార్డు ద్వారా రోగులకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. స్వైన్ఫ్లూ, కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు రోగులకు ప్రత్యేక చికిత్స అందించేందుకు ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 10 పడకల సామర్ధ్యం గల ఐసీయూ అందుబాటులో ఉన్నది. కరోనా నేపథ్యంలో ఫస్ట్, సెకండ్ వేవ్లతో కొవిడ్ అనుమానితుల తాకిడి అధికంగా వచ్చిన విషయం తెలిసిందే.
దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఐసీయూ వార్డును విస్తరించాలని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సంకల్పించారు. విషయాన్ని పలు స్వచ్ఛంద సంస్థల దృష్టికి తీసుకెళ్లగా, ‘రౌండ్ ఇండియా’ అనే సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ సహకారంతో దవాఖానలోని ఓపీ బ్లాక్ రెండో అంతస్తులో సుమారు రూ.1.25కోట్ల వ్యయంతో 40 పడకలతో ఆధునిక హంగులతో నూతన ఐసీయూ వార్డును నిర్మించారు. మరో రెండ్రోజుల్లో అందుబాటులోకి రానున్నది.
ఉస్మానియాలో కార్పొరేట్ హాస్పిటల్ను తలదన్నేలా అన్ని రకాల సౌకర్యాలతో కేవలం నెలరోజుల్లో ప్రత్యేక ఐసీయూను నిర్మించాం. సెంట్రల్ ఏసీ, ఆక్సీజన్లైన్, ఆటోమేటెడ్ బెడ్స్, పేషెంట్ లాకర్స్, మానిటర్స్ తదితర అవసరమైన అన్నిరకాల అత్యాధునిక వైద్యపరికరాలను స్వచ్ఛంద సంస్థ సహకారంతో సమకూర్చాం. ఈ ఐసీయూ వార్డుకు వెళ్లేందుకు రోగుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేశాం. డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన