సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : చారిత్రక జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి చుక్కా మురుగునీరు వచ్చి చేరకుండా ప్రభుత్వం పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. కలుషిత మచ్చను శాశ్వతంగా తొలగించేందుకు ఎక్కడకక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించింది. రెండు చోట్ల భారీ సీవర్ మెయిన్ (భారీ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం) ఏర్పాటుతో పాటు 22 చోట్ల సీవరేజి ట్రిట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీలు) నిర్మించాలని ప్రతిపాదించారు. ఉస్మాన్సాగర్ పరివాహక ప్రాంతంలో 9, హిమాయత్సాగర్ పరిసర ప్రాంతాల్లో 13 చొప్పున ఎస్టీపీల ఏర్పాటుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే తొలి ప్రాధాన్యతగా నాలుగు ఎస్టీపీల ఏర్పాటుకు రూ.82.23కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత నెలలో జీవో నం 244ను జారీ చేసింది.
హిమాయత్ సాగర్ వద్ద రోజుకు 9 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) సామర్థ్యం గల రెండు ఎస్టీపీలు రానుండగా, ఉస్మాన్ సాగర్ వద్ద 11 ఎంఎల్డీ సామర్థ్యంతో మరో రెండు ఎస్టీపీలు రానున్నాయి. జన్వాడ, చిలుకూరు, అజీజ్నగర్, కోత్వాల్గూడలో ఐదు ఎంఎల్డీల సామర్థ్యంతో మొత్తం 20 ఎంఎల్డీలతో ఈ నాలుగు ఎస్టీపీలు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు రెండు భారీ సీవర్ మెయిన్స్ ఏర్పాటుకు రూ. 960కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్సాగర్కు 46 కిలోమీటర్ల మేర సీవర్ రింగు మెయిన్, హిమాయత్సాగర్కు 53 కిలోమీటర్ల రింగు మెయిన్ పనులు చేపడతారు. త్వరలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. 2038 సంవత్సర నాటి జనాభాను పరిగణనలోకి తీసుకుని పరిరక్షణ చర్యలు చేపడతారు.
నగరానికి ప్రధాన తాగునీటి వనరు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్..ఉస్మాన్సాగర్కు 738 చదరపు కిలోమీటర్లు (117 గ్రామాలు), హిమాయత్సాగర్కు 1308 చదరపు కిలోమీటర్ల (208 గ్రామాలు) పరివాహక ప్రాంతం ఉంది. హిమాయత్సాగర్లో పరిధిలోని వెంకటాపూర్ మెయిన్ రివర్ కోర్సు (ఈసీ), దొడ్డి సుల్తాన్ పల్లి, అమ్దాపూర్, ఉస్మాన్సాగర్ పరిధిలోని చండిప్ప మొయిన్ రివర్ కోర్సు, ఖానాపూర్, పొద్దుటూర్, బాల్కాపూర్, ఎల్వర్తి, మేడిపల్లి ఛానెల్స్ల నుంచి జలాశయాల్లోని నీరు వచ్చి చేరుతుంది. అయితే జంట జలాశయాల సమీప గ్రామాల నుంచి మురుగునీరు వచ్చి చేరడం కారణంగా ఈ నీళ్లు కలుషితం అవుతున్నాయి.
చిలుకూరు, ఖానాపూర్ తదితర గ్రామల నుంచి మురుగునీటికి తోడు వ్యర్థ, క్రిమీసంహారక పదార్థాలు, నూనె మలినాలు చేరడం కారణంగా ఈ రిజర్వాయర్ల నీరు కలుషితం అవుతుందని, జలాశయాల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటికి అడ్డుకట్ట వేయాలని ఈ మేరకు నిర్ణయించి, ఈ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఎస్టీపీలను ఏర్పాటు చేయడం ద్వారా మురుగునీటి నుంచి రిజర్వాయర్లను కాపాడడంతో పాటు భూగర్భ జలాల నాణ్యతను కాపాడేందుకు దోహదపడనుంది. కాగా, గతంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి 27.59 శాతం నీటి వాటాను వినియోగించగా..ప్రస్తుతం కేవలం 1.25 శాతం కంటే తక్కువగానే వీటిపై ఆధారపడుతున్నందున హైదరాబాద్ నగరానికి ఈ జంట జలాశయాలు ప్రధాన తాగునీటి వనరు కావని ప్రభుత్వం పేర్కొన్నది.