సిటీబ్యూరో, ఆగస్టు 22 ( నమస్తే తెలంగాణ ) : కరోనా ప్రారంభం నుంచి నగరవాసులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సూపర్ మార్కెట్లలో విషపూరిత రసాయనాలతో పండించే కూరగాయలు తిని అనారోగ్యం పాలవుతుండటంతో వాటికి స్వస్తి చెబుతున్నారు. స్వయంగా సేంద్రియ ఎరువులతో రైతులు పండించిన కూరగాయలను నేరుగా వారినుంచే కొనుగోలు చేసేందుకు నగరవాసులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే నగరానికి చెందిన కొంతమంది తమ కాలనీలకు వారంలో ఒక రోజు సేంద్రియ కూరగాయలు విక్రయించే రైతులను ఆహ్వానిస్తున్నారు. ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా అమ్ముకునేలా అవకాశం కల్పిస్తున్నారు. ఫలితంగా నగరవాసులకు స్వచ్ఛమైన కూరగాయలు లభించడంతో పాటు రైతులకు లాభం చేకూరుతున్నది. వారంలో రోజుకో కాలనీలో ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆర్ట్గ్యాలరీ ఎదురుగా, ఉప్పల్, హిమాయత్నగర్, సీతాఫల్మండీ తదితర ప్రాంతాల్లో
ఏర్పాటవుతున్నాయి.
అపార్ట్మెంట్లు, గెటెడ్ కమ్యూనిటీలకు చెందిన వారు వారంలో రెండు రోజులు రైతులతో సమన్వయం చేసుకుని సంతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రోటరీ క్లబ్లు, కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సంబంధిత ప్రాంతాల్లో సంత ఏర్పాటవుతుంది. వికారాబాద్ నుంచి వస్తున్న ఈ రైతులకు ఉచితంగానే తమ ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ సంతలో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పండించిన ఉత్పత్తులను విక్రయానికి ఉంచుతున్నారు. అన్ని రకాల కూరగాయలు, చిరుధాన్యాలు, పోచంపల్లి దుస్తులు, ఆరోగ్యకరమైన నూనెలు, ఆర్గానిక్ ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, వరిగలు, సజ్జలు, రాగులు, జొన్నలు తదితర అద్భుత పోషకాలు ఉన్న చిరుధాన్యాలను ఈ సంతలో కొనుగోలు చేసేందుకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు.
నగరంలో స్వచ్ఛమైన కూరగాయలు, ఆహార పదార్థాలు లభించడం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలు వాడని ఉత్పత్తులను తీసుకోవాలి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వికారాబాద్లోని మహిళలకు రసాయనాలు వాడకుండా పంట ఉత్పత్తి చేసేలా శిక్షణ ఇచ్చాం. వాటిని నగరంలో ఏర్పాటు చేసిన విక్రయకేంద్రంలో అమ్ముకునేందుకు అవకాశం కల్పించాం. దీని ద్వారా రైతులు లాభపడుతున్నారు. వినియోగదారుడు స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసే అవకాశం లభించింది. రైతులు ఎలాంటి రుసుం చెల్లించకుండానే సంతలో విక్రయించుకోవచ్చు. – అనిల్కుమార్, సంత నిర్వాహకుడు.