బాలానగర్, జూన్ 2 :రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిబూడిదైన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలానగర్ ఏసీపీ గంగారాం తెలిపిన వివరాల ప్రకారం… అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏఆర్ 02 ఏ 9678 నంబర్గల ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు నగరంలోని సుచిత్రా చౌరస్తా నుంచి బయలుదేరి బాలానగర్ మీదుగా కూకట్పల్లి చేరుకొని తమిళనాడు రాష్ట్రం వేలూరుకు వెల్లనున్నది. కాగా ఇద్దరు ప్రయాణికులు సుచిత్రా చౌరస్తాలో బస్సు ఎక్కారు. మార్గ మధ్యలోని బాలానగర్ పారిశ్రామికవాడలోని నైఫర్ హైదరాబాద్ ఎదరుగా ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే బస్సులోని గేర్ బాక్స్ నుంచి స్పార్క్ వచ్చింది. వెంటనే బస్సులో పవర్ స్టీరింగ్ ఉండడం వలన స్టీరింగ్ తిరుగకుండా ఆగిపోయింది. వెంటనే అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులను దిగి పోవాలని డ్రైవర్ కిశోర్కుమార్ సూచించడంతో వారు దిగిపోయారు. అంతలోనే మంటలు బస్సును చుట్టుముట్టి విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు రోడ్డు మధ్యలో ఆగి పోవడంతో వాహనాల రాకపోకలు రెండుగంటల పాటు నిలిచి పోయాయి. బాలానగర్ ఏసీపీ గంగారాం, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, పోలీసుల పర్యవేక్షణలో ప్రయాణికులను దారి మల్లించారు.