బొల్లారం, ఏప్రిల్ 30: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో లోకల్ మిలటరీ అథారిటీ మూసివేసిన రోడ్లను బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులు ఆదివారం తెరిచారు. ఈ మేరకు బొల్లారం పరిధిలోని లక్డావాలా నుంచి యాప్రాల్, బాలాజీ నగర్ వెళ్లే దారి లక్డావాలా వద్ద ఉన్న గోడను కూల్చి వాహనదారుల సౌకర్యార్థం తిరిగి తెరవడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది..
కొన్నేండ్లుగా ఇక్కడ నేను ఫుట్వేర్ షాపు నడిపిస్తున్నాను. మొదటగా దుకాణం గేటు పక్కనే ఉండేది.ఆర్మీ అధికారులు గేట్ మూసివేయడంతో ఎదురుగా మార్చుకున్నాను. యాప్రాల్, బాలాజీ నగర్ సుమారు 2,3 కిలోమీటర్ల పరిధే ఉంటుంది. ఆర్టీసీ బస్సులు,వాహనదారులకు సౌకర్యంగా ఉండేది.కార్మికులు ఎక్కువ సంఖ్యలో అక్కడి నుంచే వచ్చేవారు. బీఆర్ఎస్ నాయకులు ఒక ఉద్యమంలా రోడ్లు తెరిచేందుకు నిరసన తెలిపారు. వారి ఫలితంగానే మూసివేసిన రోడ్లు తెరుచుకోవడం సాధ్యమైంది. రోడ్లను తిరిగి తెరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. – మారుతి, ఫుట్వేర్ షాపు నిర్వాహకులు
ప్రజాభిప్రాయం తీసుకొని..
లక్డావాలా రోడ్లను తిరిగి తెరిచినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. బాలాజీ నగర్, యాప్రాల్, అమ్ముగూడకు వెళ్లాలంటే చాలా అసౌకర్యంగా ఉండేది. ఇక్కడి నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. కేంద్ర రక్షణ శాఖ అధికారులు ప్రజాభిప్రాయం తీసుకొని రోడ్లను తెరిచినందుకు సంతోషంగా ఉంది.
-జి.వి.బాల్రాజు, స్థానికుడు