బన్సీలాల్ పేట్, మే 14 : గాంధీ దవాఖానలో ప్రతిరోజూ వివిధ ఆరోగ్య సమస్యలతో 1500కి పైగా బయటి రోగులు వస్తుంటారు. ఓపీ చిట్టి తీసుకోవడానికి చాలా పెద్ద క్యూ లైన్లో వేచి ఉండడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అక్కడ ఆలస్యం జరగకుండా, సత్వరమే చిట్టి పొందేందుకు ఇప్పుడు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానం అందరికీ ఉపయోగపడుతున్నది.
సాధారణ ప్రజలు తమ మొబైల్ ఫోన్లో ఆయుష్మాన్ భారత్ (ఆభా) యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆధార్ నంబర్తో రిజిస్టర్ కావాలి. అనంతరం ఆధార్ కార్డు తో అనుసంధానమైన మొబైల్ ఫోన్ నంబర్కు వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్ కేటాయిస్తారు. దానిని మనం భద్రపరచుకోవాలి. భవిష్యత్లో మనం ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా.. ఈ ఆభా నంబర్తో సులభంగా లాగిన్ కావచ్చు.
రోగి ఏ డాక్టర్ను సంప్రదించాడు.. ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.. ఎలాంటి మందులు డాక్టర్ సిఫారసు చేశారు.. ఏం చికిత్స అందించారు.. తదితర రోగి వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో ఆటోమేటిక్గా నమోదవుతాయి. కాగా, గాంధీ దవాఖాన లో బయటి రోగుల విభాగం ద్వారా టోకెన్ నంబర్ పొందవచ్చు. దాన్ని రిజిస్ట్రేషన్ కౌంటర్ లో చెప్పగానే వెంటనే ఓపీ స్లిప్ మన చేతికి వస్తుంది. ఇక క్యూ లైన్ లో వేచి ఉండే అవసరం లేదు. ఇంట్లో ఉన్నప్పుడే, ‘ఆభా’ యాప్ ద్వారా ఓపీ టోకెన్ నంబర్ పొందవచ్చు.