Gandhi Hospital | బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 25 : గాంధీ దవాఖానలో రోగి వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది వరకు కుటుంబ సభ్యులు దవాఖానకు రావడం, గేట్ల వద్ద సిబ్బందితో గొడవలకు దిగి దుర్భాషలాడటం, కొట్టడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాము వారి పరిస్థితిని అర్థం చేసుకోగలమని తెలిపారు. కానీ డాక్టర్లకు రోగిని పరిశీలించి వైద్యం అందించడానికి తగిన వాతావరణం ఉండాలని, వారు త్వరగా కోలుకునేందుకు సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా క్యాజువాలిటీ, ఐసీయూ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఎమర్జెన్సీ వార్డుల్లోకి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో రోగులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని తమ సిబ్బంది వారికి చెబుతున్నా, వినిపించుకోవడం లేదన్నారు. ఇటీవల పలుమార్లు తమ సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బందిపై కొందరు రోగి బంధువులు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. వారిపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఆర్ఎంఓ, సీఎంఓ, సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. రోగులను సందర్శించడానికి సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య అనుమతి ఉన్నదని తెలిపారు. మిగతా సమయంలో అనుమతి ఉండదని, ప్రజలు ఇది గుర్తించాలని కోరారు.
దవాఖానలోకి వచ్చే మార్గాల్లో సెక్యూరిటీ సిబ్బందిని పెంచామని, గేట్ల వద్ద కచ్చితంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తామన్నారు. తాము పారిశుధ్యం నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నామని, బయట నుంచి వచ్చే రోగి బంధువులు వార్డుల్లో, పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయడం, టాయిలెట్లను అపరిశుభ్రం చేయడం లాంటివి చేస్తున్నారని అన్నారు. పారిశుధ్య సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల గతంలో కంటే ఇప్పుడు వార్డులు, కారిడార్లలో శుభ్రత మెరుగుపడిందని పేర్కొన్నారు. వాహనాల కోసం కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలని, నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని వివరించారు. దవాఖాన వద్ద ప్రశాంతత నెలకొల్పడానికి సహకరించాలని ఆయన కోరారు.