సిటీబ్యూరో, ఆగస్టు 18 ( నమస్తే తెలంగాణ ) : చదువు విషయంలో పేరెంట్స్ చాలా సీరియస్గా ఉన్నారు. ఆన్లైన్ విద్యకంటే బడిలో చదువులకే జై కొడుతున్నారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కూడా చాలా మంది తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ చదువులపై పేరెంట్స్ అభిప్రాయాలను తెలుసుకోవడానికి “లోకల్ సర్కిల్స్” దేశవ్యాప్తంగా సర్వే జరిపింది. రోజులు గడిచినా కొద్దీ కరోనా పట్ల భయం తగ్గుతూ వస్తున్నదని వెల్లడించింది. ఆన్లైన్ విద్యాభ్యాసంపై చాలా మంది పేరెంట్స్ విముఖత వ్యక్తం చేస్తున్నారని, విద్యార్థులు పాఠాలను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని బాధపడుతున్నట్టు సర్వే వెల్లడించింది. బాగా చదివే విద్యార్థులు వీటి వల్ల వెనకబడిపోతున్నారని తల్లిదండ్రులు అభిప్రాయపడినట్లు పేర్కొంది.
తెలంగాణలో 2,077 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించిన లోకల్ సర్కిల్స్.. 55 శాతం మంది తమ పిల్లలను బడికి పంపించేందుకు సిద్ధంగా ఉంటే.. 42 శాతం మాత్రం సందేహిస్తున్నట్లు సర్వేలో తేలింది. 88 శాతం మంది తల్లిదండ్రులు ఆగస్ట్లో స్కూల్స్ తెరిస్తే.. బాగుంటుందంటే.. మరో 23 శాతం మంది సెప్టెంబర్ నుంచి బడులు తెరవాలని కోరుకున్నారు. 3 శాతం మంది స్కూల్స్ ఓపెనింగ్పై ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. అయితే 67 శాతం తల్లిదండ్రులు ప్రతి పాఠశాలలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచాలని , ఉపాధ్యాయులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ చేపట్టాలని తెలిపినట్లు లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది.