ఇన్వుల్నర్వ, వెల్జర్ల గ్రామాల్లో భూసమీకరణ పథకం
తుది నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ
95 ఎకరాల్లో ఏరియా డెవలప్మెంట్ ప్లాన్
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
సిటీబ్యూరో,జూన్18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో భూ సమీకరణ పథకానికి భూయజమానులకు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతున్న లేఅవుట్ల అభివృద్ధిని చూసి రైతులు స్వయంగా తమ భూములను అప్పగించేందుకు ముందుకు వస్తున్నారు. అందుకు నిదర్శనం ఇటీవలే ఘట్కేసర్ మండలంలోని ప్రతాపసింగారంలో 130 ఎకరాల భూమిని అప్పగిస్తూ రైతులు అంగీకార పత్రాలను హెచ్ఎండీఏకు అందజేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు మండల పరిధిలో ఇన్వుల్నర్వ, ఫరూఖ్నగర్ మండల పరిధిలోని వెల్జర్ల గ్రామాల్లో కలిపి 95 ఎకరాల భూములను హెచ్ఎండీఏ అప్పగించారు. దీంతో ఒకే చోట భారీ లేఅవుట్ నిర్మాణం ద్వారా ఆ ప్రాంతంలో అత్యంత మెరుగైన మౌలిక వసతులను హెచ్ఎండీఏ అభివృద్ధి చేయనుంది. ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు చేసే లేఅవుట్ల కంటే హెచ్ఎండీఏ నిబంధనలకు చేపట్టే ప్లాట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ప్రణాళికతో పట్టణీకరణ..
హైదరాబాద్ మహానగరం నలుమూలలా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకేచోట పెద్ద మొత్తంలో భూములను సమీకరించి భారీ లేఅవుట్లను చేయడం ద్వారా అటు ప్లాట్ల కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటు రైతుల భూములకు మంచి విలువ దక్కుతుంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూమలు ఇచ్చే వారికి ఆర్థికపరమైన సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులకు సంబంధించిన వ్యవహారాన్ని హెచ్ఎండీఏ నిర్వహిస్తుంది. ప్రధానంగా నాలా చార్జీలతో పాటు ల్యాండియూజ్ కన్వర్షన్ చార్జీలను హెచ్ఎండీఏ భరిస్తుంది. భూములు ఇచ్చిన వారి రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా హెచ్ఎండీఏనే చెల్లిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్ చేయడం వల్ల విశాలమైన రోడ్లు ఉంటాయి. హెచ్ఎండీఏ ప్రణాళికబద్ధంగా అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ఇదంతా ఒక ప్రభుత్వ రంగ సంస్థగా హెచ్ఎండీఏ చేయడం వల్ల భవిష్యత్లో ఈ ప్రాంతం ప్రణాళికాబద్దంగా అభివృద్ధి కావడంతో పాటు మార్కెట్లో భూములకు, ప్లాట్లకు మంచి డిమాండు వచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.