హైదరాబాద్ : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సోమవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ పై హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థుల్లో అనేక మంది నిరుపేదలు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేసిందని వివరించారు.
ఈ కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒక్కొకరికి నెలకు 5 వేల రూపాయల వరకు ఫుడ్, ట్రాన్స్ పోర్ట్ ఖర్చుల కోసం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఒక్కో బ్యాచ్ కు 100 మంది చొప్పున మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుభవజ్ఞులైన వారితో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గాలలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఏప్రిల్ 27 వ తేదీ నుంచి గ్రూప్ -1 శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు జేడీ అలోక్ కుమార్ వివరించారు.
అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మే 7 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మైనారిటీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో చార్మినార్ లోని ఉర్దూ మాస్కాన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెంటర్ లో మే 6 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులకు వివరించారు. ఎస్పీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్ లో ఏప్రిల్ 29 నుంచి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, బీసీ వెల్ఫేర్ జేడీ అలోక్, డీడీ ఆశన్న, ఎస్సీ కార్పోరేషన్ డీడీ రామారావు, మైనారిటీ వెల్ఫేర్ డీడీ ఖాసీం, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.