సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు పొంచి ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఎఫ్7అనే ఒమిక్రాన్ ఉప వేరియంట్ అలజడి సృష్టిస్తున్నప్పటికీ ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా కేసుల తీవ్రత పెద్దగా కనిపించడం లేదు. అయినప్పటికీ వైరస్కు వ్యాప్తి గుణం అధికంగా ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు. వైరస్తో పెద్ద ప్రమాదం లేనందున ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేనప్పటికీ పోస్ట్ కరోనా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హెచ్చరించారు.
సంక్రాంతికి స్వగ్రామానికి 65వ జాతీయ రహదారిపై పెరిగిన వాహనాల రద్దీ
హైదరాబాద్ – విజయవాడ (65వ) జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పండుగకు ఒక రోజు ముందునుంచే ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాటపట్టారు. వేల సంఖ్యలో వాహనాలు జాతీయ రహదారిపైకి రావడంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ స్తంభించి పోకుండా ఎన్హెచ్ఏఐ, జీఎంఆర్, పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అదనపు సిబ్బందిని నియమించారు. ఫాస్టాగ్ విధానం ఉన్న వాహనాలు వెంటనే టోల్ప్లాజా దాటి వెళ్తుండగా.. ఫాస్టాగ్ లేని వాహనాలు అధిక సమయం స్తంభించి పోతున్నాయి. పంతంగి టోల్ప్లాజా వద్ద 16టోల్ బూత్లు ఉండగా.. విజయవాడ వైపు 10 బూత్లు తెరిచారు. ట్రాఫిక్ నియంత్రణకు తంగడపల్లి క్రాస్ రోడ్డును మూసివేశారు. కాగా నిత్యం ఈ రహదారి గుండా 30వేల పైచిలుకు వాహనాలు వెళ్తుండగా వీకెండ్, సెలవు దినాల్లో మరో ఐదారు వేలు అదనంగా ప్రయాణిస్తాయని అధికారులు తెలుపుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు అదనంగా 20వేలకు పైగా వాహనాలు వెళ్లవచ్చని జీఎమ్మార్ అధికారులు అంచనా వేస్తున్నారు.
పతంగుల పండుగ వచ్చింది మార్కెట్లో విభిన్న రకాల పతంగులు
సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి అంటే తొలుత గుర్తుకు వచ్చేది పతంగులు. వీటిని ఎగురవేయడానికి చిన్నాపెద్ద ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. దీంతో నగరంలోని కోఠి, అబిడ్స్, ధూల్పేట్, మంగళ్హాట్, సుల్తాన్బజార్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, ప్యాట్నీ, అమీర్పేట్, హైటెక్సిటీ, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో షాపులన్నీ కైట్స్తో కళకళలాడుతున్నాయి. చిన్నారులను, పెద్దలను ఆకర్శించేలా తీరొక్క డిజైన్స్తో పతంగులను తయారుచేసి మార్కెట్లో విక్రయానికి ఉంచారు. నచ్చిన కైట్ను కొనుగోలు చేస్తున్న నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.