మేడ్చల్, ఫిబ్రవరి19(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల ప్రారంభానికి గాను 36 పాఠశాలలో టెండర్లు పూర్తయ్యాయి. రూ.10 కోట్ల 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. మొదటి దశలో 176 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేయగా ఇప్పటికే 30 ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. కాగా అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలను దశల వారీగా ప్రారంభిస్తున్నారు. త్వరలోనే మిగతా పాఠశాలల పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని 15 మండలాల్లో మండలానికి రెండు చొప్పున పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తి కాగా మరో 110 పాఠశాలలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ఎప్పటి కప్పుడు జిల్లా విద్యాధికారి విజయ కుమారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక అధికారుల నియామకం
మన ఊరు-మనబడి కార్యక్రమంలో పాఠశాలలో అభివృద్ధి పనుల పూర్తికి ప్రత్యేక అధికారులను నియమించాం. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నివేదికలను అందజేస్తున్నారు. పనుల పురోగతిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నాం. పనులను పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలను ఇస్తున్నాం.
-విజయకుమారి, జిల్లా విద్యాధికారి