అంబర్పేట: మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కారణంగా ఇండ్లు కోల్పోతున్న యజమానులకు చెక్కుల రూపంలో నష్ట పరిహారాన్ని అందిస్తామని చెప్పిన అధికారులు మాటతప్పుతున్నారు. చెక్కులు కాదు ఇప్పుడు టీడీఆర్ఇస్తామని చెబుతున్నారు. అయితే ‘మాకు టీడీఆర్..వద్దు చెక్కులే కావాలి’ అని బాధితులు కోరుతున్నారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా 24 కట్టడాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇండ్లు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారాన్ని చెక్కుల రూపంలో అందిస్తామని జీహెచ్ఎంసీ ల్యాండ్ అక్విజేషన్ డిప్యూటీ కలెక్టర్ వారికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు.
చదరపు గజానికి రూ. 40,600 చొప్పున డబ్బులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల కిందట నలుగురికి మాత్రం చెక్కులు ఇచ్చిన అధికారులు.. ఇప్పుడు మాట తప్పారు. ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు లేవంటూ తమకు టీడీఆర్ ఇస్తామంటున్నారని ఇండ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.