కొండాపూర్, మార్చి 9 : మహిళా దినోత్సవం రోజున మహిళలను అవమానపరిచేలా అధికారుల తీరుందంటూ సోమవారం మియాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. మహిళా దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలుపుతూ వేసుకున్న ఫ్లెక్సీలను తొలగించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఒక మహిళా అధికారి మహిళ దినోత్సవాన ఫ్లెక్సీలు తొలగించేలా ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్నది ఎవరంటూ ప్రశ్నించారు.
మిగతా పార్టీల ఫ్లెక్సీలను అలాగే ఉంచి కేవలం బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం కక్ష సాధింపు చర్యలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు తమ విధులు తాము నిర్వర్తించాలని, కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నియోజక వర్గంలో అనేక సమస్యలున్నాయని, వాటిపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పోలీసుల ఓవర్ యాక్షన్…ఫ్లెక్సీలా తొలగింపు పై మియాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న తమను బలవంతంగా వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేయడమేంటి? ప్రజలకు నిరసనలు తెలిపే హక్కులు కూడా లేవా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఫ్లెక్సీలు అలాగే ఉంచుతారు, బీఆర్ఎస్ పార్టీవీ తొలగింపు పై అధికారులు సమాధానం చెప్పే వరకు నిరసన విరంపజేసేది లేదంటున్నారు. పోలీసులు అందరిని సమంగా చూడాలని, కాంగ్రెస్ కోసమే పని చేయొద్దని, అధికారం ఎవరి సొంతం కాదు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ హెచ్చరించారు. నిరసనలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, నాయకులు పారునంది శ్రీకాంత్, రోజా దేవి, నరేందర్ యాదవ్, కార్తీక్, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.