సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/మైలార్దేవ్పల్లి : రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారన్న వార్తలు, వదంతులు అవాస్తవమని జలమండలి అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ ఘటనపై జలమండలి అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టగా.. సరఫరా అయినా నీరు సురక్షితమేనని తేలినట్లు చెప్పారు. జలమండలి ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ, క్వాలిటీ కంట్రోల్ జనరల్ మేనేజర్ ఘటనా స్థలాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ నీటిని రిజర్వాయర్ల దగ్గర పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిలోనూ, వినియోగదారుల ఇంటి దగ్గర కూడా నీటిని సేకరించి పరీక్షించగా ఎలాంటి కలుషితం కాలేదని తేలిందన్నారు. ప్రాథమికంగా ఆయా ప్రాంతాల్లో ఈనెల 8వ తేదీన జలమండలి సెంట్రల్ ల్యాబోరేటరీ శాంపిల్లో బ్యాక్టీరియా టెస్టుల్లోనూ నీటిలో ఎలాంటి హానికర అవశేషాలు లేవని అధికారులు పేర్కొన్నారు. 0.5 పీపీఎం క్లోరిన్ ఉన్నట్లు గుర్తించామన్నారు. బుధవారం ఉదయం కూడా జలమండలి క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది తాగునీరు సరఫరా చేసిన సమయంలో సేకరించిన శాంపిళ్లలో కూడా ఎలాంటి అనారోగ్య కారకాలు లేనట్లు తేలిందన్నారు. దీంతో జరిగిన ఘటనకు కారణం జలమండలి సరఫరా చేసిన తాగునీరు కాదని ప్రాథమికంగా అంచనా వేశారు.
మొఘల్ కాలనీలో బాధిత కుటుంబానికి సమీపం గృహం ఇంటి నం.8-2-133 నుంచి సేకరించిన నీరు శాంపిల్లోనూ తాగడానికి అనువుగానే ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. చనిపోయిన ఇద్దరు (ఆఫ్రీన్ సుల్తానా, మహ్మద్ ఖైసర్) వారం రోజులుగా ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రసార మాధ్యమాల (టీవీ చానెళ్లు)లో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలు అని తెలిపారు. జలమండలి సరఫరా చేస్తున్న నీరు సురక్షితమైందని, మూడంచెల శుద్ధి ప్రక్రియ తర్వాత సరఫరా చేస్తామని, సాధారణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పుకార్లు నమ్మొద్దని జలమండలి అధికారులు కోరారు. ఈ ఘటనపై మరింత సమగ్ర విచారణ చేపడుతున్నట్లు, అవసరమైతే ఈ పుకార్లు వ్యాప్తి చేసిన వ్యక్తులపై పోలీస్ కేసు నమోదు చేయాలని జలమండలి ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
జలమండలి అధికారులు, క్వాలిటీ కంట్రోల్ బోర్డు, వైద్య బృందాలు సందర్శించి, చనిపోయిన వారి కుటుంబాలతో మాట్లాడారని రాజేంద్రనగర్ తాసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. వారి మెడికల్ రిపోర్టులను కూడా పరిశీలించారన్నారు. ఇద్దరి మరణానికి, మరికొంత మంది అస్వస్థతకు అక్కడి తాగు నీరు కారణం కాదని చెప్పారన్నారు. అక్కడి తాగు నీటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారని తెలిపారు. సమగ్ర సమాచారంతో కూడిన రిపోర్ట్ను జిల్లా కలెక్టర్కు పంపిస్తామన్నారు.