సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): బొల్లారం రాష్ట్రపతి నిలయం అధికారులు విద్యార్థులకు సమ్మర్ బొనాంజాను ప్రకటించారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా పర్యాటకులకు తీపికబురు ప్రకటించి.. ఏడాది పొడవునా సందర్శకులకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఏడాదికి 15 రోజులే సందర్శించేందుకు అవకాశం ఉండేది. తాజాగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను రాష్ట్రపతి నిలయాన్ని తిలకించేందుకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగానే అనుమతించనున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ 30వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులను కూడా అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి 150 మంది విద్యార్థులకు గాను 5గురు టీచర్లు సందర్శించేందుకు వీలుందని పేర్కొన్నారు.
రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉత ప్రవేశాన్ని కల్పించడంతో ఇక ప్రతి రోజూ విద్యార్థుల సందడి నెలకొననుంది. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మిగతారోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు అనుమతిచ్చింది.
యాత్రికులకు పార్కింగ్, క్లాక్రూం, వీల్చైర్, కాఫీ షాప్ సావనీర్స్టోర్, రెస్ట్రూమ్స్, ఆర్వో వాటర్, క్యాంపస్లో డిస్పెన్సర్లు, ఫస్ట్ ఎయిడ్ సెట్తో పాటు ఉచితంగానే గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు.
ప్రభుత్వ పాఠశాలల నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శన కోసం వచ్చే విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడి చేత లెటర్ తీసుకురావాలని సూచించారు. ఎంతమంది వస్తున్నారో ముందుగా తెలియజేస్తే రద్దీ లేకుండా చూసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి నిలయం అధికార వర్గాలు తెలిపాయి. అదనపు సమాచారం కోసం 040-29560518 నంబర్లో సంప్రదించాలని కోరారు.