అంబర్పేట, జనవరి 21 : కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఇంటింటి జ్వర సర్వేను చేపట్టింది. అంబర్పేట సర్కిల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కిందకు వచ్చే బస్తీలు, కాలనీల్లో సర్వేను ప్రారంభించారు. సర్కిల్ డీసీ వేణుగోపాల్, డీపీవో రజితతోపాటు ఎస్పీహెచ్వో డా.హేమలత, మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే కొనసాగింది. బాగ్అంబర్పేట, తిలక్నగర్, అర్రాస్పెంట, ఏఎంఎస్ యూపీహెచ్సీల పరిధిలోని బస్తీల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఒక్కో ఆశ వర్కర్ 60 ఇండ్లల్లో సర్వే చేసి పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించారు. ప్రతి యూపీహెచ్సీ పరిధిలో 350 ఇండ్లలో సర్వే జరిగింది. 2100 ఇండ్లలో సర్వే చేయగా, 150 మందికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. వారందరికి మెడికల్ కిట్లు అందజేశారు. ఎస్పీహెచ్ఓ డా.హేమలత మాట్లాడుతూ.. అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటి జ్వర సర్వే శుక్రవారం మొదలైందన్నారు. జీహెచ్ఎంసీ సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్లు ఈ సర్వేలో పాల్గొని జ్వర పీడితులను గుర్తిస్తున్నారన్నారు. మొదటి రోజు 150 మంది కరోనా బాధితులను గుర్తించి వారికి మెడికల్ కిట్లు అందజేశామని చెప్పారు.
‘జ్వర సర్వే’ పరిశీలన
అంబర్పేట డివిజన్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను కార్పొరేటర్ విజయ్కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సర్వే బృందానికి తెలియజేయాలన్నారు.
వ్యాక్సిన్ వేసుకోండి..కరోనాను తరిమికొట్టండి
కరోనాను కట్టడి చేయడానికి మాస్కు ధరించాలని కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి కోరారు. ఇటీవల కరోనా సోకిన కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి కోలుకోవాలని నింబోలిఅడ్డా మహాంకాళి ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కన్నె రమేశ్యాదవ్, సుభాశ్పటేల్, కేసరి నర్సింగ్యాదవ్, బీంరాజ్, రమాదేవి, రవియాదవ్, మల్లికార్జున్, వాసు, రాజ్కుమార్, ఆర్.సంతోశ్, బాలప్రసాద్ పాల్గొన్నారు.