సిటీబ్యూరో/మేడ్చల్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్.చౌహన్, జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వాగార్గ్, అమన్ మిట్టల్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాల్లో ఏర్పాటు చేసిన బారీకేడ్లను పరిశీలించి సూచనలు చేశారు.
తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా సాఫీగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 3వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రశాంతమైన వాతావరణం మధ్య నిర్వహించేలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. అధికారుల వెంట అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, డీసీపీ జానకి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.