ఖైరతాబాద్: వరద ముంపునకు ప్రధాన కారణంగా నిలుస్తున్న నాలాల సమస్యలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని రాజ్నగర్ నాలా పరిస్థితి దయనీయంగా మారింది. నాలాలో భారీగా చెట్లు పెరిగి, వ్యర్థాలు, మట్టి పేరుకుపోయి.. నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలకు ముంపు సమస్య తప్పేలా లేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందే నాలాలను డీసిల్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ సర్కిల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండేండ్లుగా పూడికతీతలకు నోచుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
కోట్లు నాలా పాలు..?
ప్రతి ఏడాది నాలాల డీసిల్టింగ్ కోసం జీహెచ్ఎంసీ వందలాది కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నది. తద్వారా నగరంలోని నాలాలన్నింటీలో ఎండా కాలంలోనే పూడికతీత పనులు చేపడుతారు. ఖైరతాబాద్ సర్కిల్లో మాత్రం కోట్లాది రూపాయలు మంజూరైనా నాలాలు డీసిల్టింగ్కు నోచుకోవడం లేదు. రాజ్నగర్ నాలాను జీహెచ్ఎంసీ నామమాత్రంగా శుభ్రం చేసి వదిలేస్తుండడంతో సమస్యలు తప్పడం లేదు. వర్షాకాలం వస్తే ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని నాలాల డీసిల్టింగ్ కోసం మంజూరైన నిధులను అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజ్నగర్ నాలాను పూర్తి స్థాయిలో శుభపర్చి వచ్చే వర్షాకాలంలో ముంపు సమస్యను తప్పించాలని ప్రజలు కోరుతున్నారు.
