సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతూ వేధిస్తున్న వారిపై ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..గత సంవత్సరం డిసెంబరు 23 నుంచి కొందరు వ్యక్తులు వేర్వేరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా తన పరువుకు భంగం కలిగించే విధంగా, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు నటి అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఒకరు ఏపీలోని కడప జిల్లాకు చెందిన జనార్దన్గా గుర్తించారు. నగరంలోని ఇందిరానగర్లో నివాసం ఉంటూ, ఏఐ ద్వారా అనసూయకు సంబంధించిన కల్పిత వీడియోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సర్క్యులేట్ చేస్తున్నట్లు గుర్తించారు. మరొక నిందితుడు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన అరుణ్కుమార్గా పోలీసులు గుర్తించారు. ఇటీవల నటికి సంబంధించిన రీల్ను వీక్షించిన నిందితుడు ఆ రీల్పై అసభ్యకరమైన కామెంట్ను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.