GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. తొలుత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి అన్ని పార్టీల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా తొలుత బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ డిప్యూటేషన్లపై, స్ట్రీట్ లైట్ల నిర్వహణపై ఎంఐఎం కార్పొరేటర్ మిర్జాముస్తక్ బేగ్, అడ్వర్టయిజ్మెంట్ అవినీతి, అక్రమాలపై బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్రెడ్డి, కోచ్ నియామకం, స్పోర్ట్స్ అంశాలపై సయ్యద్ సోహైల్ ఖాద్రిలు సభలో ప్రశ్నించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్ల దుబారా, అడ్వర్టయిజ్మెంట్ విభాగం అక్రమాలు, వీధి దీపాల నిర్వహణలపై తీవ్రస్థాయిలో అధికారుల లోపాలను సభ్యులు ఎండగట్టారు. అడ్వర్టయిజ్మెంట్ పాలసీ , హోర్డింగ్ల విధానం, ప్రకటనల్లో కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం రావడం లేదని, పక్కదారి పడుతున్నదని, కోట్లాది రూపాయల స్కాం జరుగుతున్నదని, కేవలం రెండు ఏజెన్సీలు లీడ్ స్పేస్, ప్రకాశ్ యాడ్స్ కంపెనీల గుత్తాధిపత్యంలో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం గండిపడుతున్నదని తక్షణం చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల సభ్యులు స్పష్టం చేశారు.
ఈవీడీఎంలో ఇద్దరు అధికారులు కార్తిక్, అజయ్లపై తీవ్రస్థాయిలో సభ్యులు ఆరోపణలు చేశారు. 2017 నుంచి జీహెచ్ఎంసీలో కొత్తగా ‘కార్తిక్’ ట్యాక్స్ చెలామణి అవుతున్నదని వంగా మధుసూదన్ రెడ్డి అరోపించారు. మెట్రో పిల్లర్ ప్రకటనలపై ఆయనకు ప్రత్యేకంగా ట్యాక్స్ వెళ్తున్నదని, మెట్రో, మాల్స్, పెద్ద భవనాలు, డిజిటల్ బోర్డుపై అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. అక్రమ హోర్డింగ్స్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు మేయర్ను కోరగా, అన్ని పార్టీలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. రెగ్యులర్ అడ్వర్టయిజ్మెంట్కు సంబంధించిన ఒక విచారణ అధికారిని నియమించి, విచారణ చేసి.. నివేదిక సమర్పించాలన్నారు. త్వరలో హోర్డింగ్స్, ఎల్ఈడీ స్క్రీన్లపై కొత్త పాలసీ రానున్నదని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు. కాగా, మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాలు, మధ్యాహ్నం బడ్జెట్పై చర్చించి సభ ఆమోదం తెలపనున్నది.
ప్రశ్నోత్తరాల సమయంలో తొలుత మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ జీహెచ్ఎంసీలో ఎంత మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్, డిప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగుల వివరాలపై చర్చించారు.డిప్యూటేషన్లపై జీహెచ్ఎంసీకి క్యూ కడుతున్నారని, చాలా మంది ఉన్నతాధికారులకు పనిలేకుండా ఉన్నారని శ్రవణ్ ఆరోపించారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి వచ్చి ఏండ్ల తరబడి ఒకేస్థానంలో అధికారులు పాతుకుపోయారని, పలుకుబడితో అధికారులు వందల కోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని, ఏండ్ల తరబడి ఉన్న అధికారులను పంపే విధంగా తీర్మానం చేయాలని శ్రవణ్ పట్టు పట్టారు. డిప్యూటేషన్ల పేరిట జరిగే దుబారాను అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జీహెచ్ఎంసీ అడ్మిన్, కమిషనర్ సమాధానం ఇచ్చారు. జీహెచ్ఎంసీలో మొత్తం 9138 మంది ఉద్యోగులు ఉండగా..4603 రెగ్యులర్, 28, 763 ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని అడ్మిన్ సరోజ తెలిపారు. ఇతర శాఖలకు సంబంధించి 778 మంది జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారని, 45 మంది ఎక్స్టెన్షన్ (రిటైర్డ్ ఉద్యోగులు)పై కొనసాగుతున్నారని కమిషనర్ రోనాల్డ్రాస్ వెల్లడించారు.
జోనల్ సమీక్షలపై కార్పొరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మేయర్ జోక్యం చేసుకొని అసలు సంబంధిత అధికారులు లేకుండా సమీక్షలు జరపడం ఏమిటని ప్రశ్నించారు. మేయర్ లేకుండా జోనల్ సమీక్షలు నిర్వహిస్తున్నారని, కార్పొరేటర్ల సమస్యలను పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బల్దియా అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఉండాలని.. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్కు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్ల తీరు బాగా లేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బడ్జెట్ తయారు చేసే సమయంలో కార్పొరేటర్ల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
వీధి దీపాల నిర్వహణ ఏ మాత్రం బాగలేదంటూ సభ్యులు మండిపడ్డారు. నాలుగు నెలలుగా ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలిందని, కనీసం పునరుద్ధరణ వ్యవస్థ లేదని ఎమ్మెల్యే గాంధీ ఆరోపించారు. ఒక లక్ష రూపాయలు మంజూరు చేయలేనప్పుడు, ప్యాచ్ వర్క్ పనిచేసే పరిస్థితి లేనప్పుడు ఐఏఎస్ అధికారులు ఉండి ఏం లాభమని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా సభ్యులు వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, కొన్ని చోట్ల 24 గంటలు వెలుగుతున్నాయని, లైట్స్ పెట్టిన వెంటనే పోతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్ఈ శ్రీనివాస్ (ఎలక్ట్రికల్) సమాధానంపై కార్పొరేటర్లు భగ్గుమన్నారు. కమిషనర్ రోనాల్డ్రాస్ సమాధానమిస్తూ..ఆటోమెటిక్ టైమర్ పెట్టుకున్నా.. 7వేల సీసీఎంఎస్ బాక్స్లు మ్యాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నారని, కేబుల్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కాగా, ఉదయం 10.28 గంటలకు సభ ప్రారంభమవ్వగా, మధ్యాహ్నం 3.40 గంటలకు సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు నవీన్కుమార్, ప్రభాకర్, సురభి వాణీదేవి, మహమూద్ అలీ, గోరటి వెంకన్న, బల్మూరి వెంకట్, మహమ్మద్ మిరాజ్ బేగ్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మీర్ జుల్పేకర్ అలీ, మహమ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ ముబిన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.