సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : భయంకరమైన వ్యాధులు సమాజానికి సవాలుగా మారుతున్న తరుణంలో పౌష్టికాహారంతోనే మెరుగైన జీవితం సాధ్యమవుతుందని ప్రముఖ పోషకాహార నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.వి.ప్రకాశ్ అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థలో జరిగిన న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా 54వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండేండ్ల కిందటి వరకు జవాన్, కిసాన్ సేవలే దేశానికి ఎంతో కీలకంగా ఉండేవని, కరోనా తర్వాత జవాన్, కిసాన్తోపాటు విజ్ఞాన్ కూడా ప్రధాన పాత్రను పోషించిందన్నారు.
ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత మాట్లాడుతూ.. చిన్న పిల్లలలో న్యూట్రిషన్ లోపం అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. పెరుగుతున్న వ్యాధుల నియంత్రించే బాధ్యత ఎన్ఐఎన్, న్యూట్రిషన్ సోసైటీ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలపై ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన పోషకాహార ప్రమాణాలనే ఇప్పటికీ దేశంలో అమలు చేస్తున్నామని, దేశీయంగా షౌష్టికాహార అవసరాలకు అనుగుణంగా న్యూట్రిషన్ ఇండెక్స్ను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం వార్షికోత్సవ సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ బీ. దినేశ్ కుమార్, ఎన్ఎస్ఐ సెక్రటరీ లక్ష్మయ్య, డాక్టర్ మోహన్ ఐసీఎంఆర్ సెక్రటరీ రాహుల్ బాహ్ల్ ఉన్నారు.