సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో హైదరాబాద్ నగరంలోనూ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. గర్భిణులకు సంబంధించిన డేటా సేకరణ, పంపిణీ చేసే పద్ధతి తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తారని, ఆరోగ్యవంతమైన శిశువులు జన్మించినప్పుడే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు మాతా, శిశు సంరక్షణలో కోసం రాష్ట్రంలో ఈ న్యూట్రీషన్ కిట్స్ పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నగరంలోనూ ఈ కిట్స్ పంపిణీ చేసేందుకు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం
గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల కోసం ఇప్పటికే అంగన్వాడీల ద్వారా పాలు, గుడ్డు, అన్నం, బాలామృతం తదితర పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి తెలిపారు. అయితే మాతా, శిశు సంరక్షణలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ న్యూట్రిషన్ కిట్స్తో గర్భిణిలతో పాటు పుట్టబోయే బిడ్డకూడా మరింత ఆరోగ్యంగా ఉంటారన్నారు.
కామారెడ్డిలో న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, చిత్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, తదితరులు ఉన్నారు
ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఈ న్యూట్రీషన్ కిట్స్ను ప్రారంభించాం. త్వరలోనే నగరంలోనూ ప్రారంభిస్తాం. ఇప్పటికే నగరంలోని పలు పీహెచ్సీలకు కిట్స్ వచ్చాయి. గర్భిణీల్లో రక్తహీనత, విటమిన్ల లోపం తదితర సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ న్యూట్రీషియన్ కిట్స్ అందజేస్తాం. దీంతో ముఖ్యంగా తల్లులకు ప్రసవంలో ఎదురయ్యే సమస్యల్లో ప్రధానమైన రక్తహీనత వంటి వాటి నుంచి బయటపడవచ్చు.
– డాక్టర్ వెంకటి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్