సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : వాహనాల నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. నెంబర్ ప్లేట్ లేకుండా, ట్యాంపరింగ్, నకిలీ నంబర్ ప్లేట్ వాడి దొంగలు స్నాచింగ్లకు వాడుతున్నారని, ఈ విషయంలో పోలీసులు సీరియస్గా ఉంటారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వాహనాల నంబర్ ప్లేట్ను సరిగ్గా అమర్చుకోవాలని సీపీ సూచించారు. రాచకొండ పరిధిలో నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్తో తిరిగే వాహనం ఒక్కటి కూడా ఉండకూడదనే లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 12న ఎల్బీనగర్, 13న జవహర్నగర్ ఠాణాల పరిధిలో స్నాచింగ్ యత్నానికి సంబంధించిన ఘటనలను ఛేదించారు. ఈ వివరాలను సీపీ వెల్లడించారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బైరమాల్గూడకు చెందిన బాలమ్మ కూరగాయలు కొని ఇంటికి వెళ్తుండగా బైక్పై వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలోని 27 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనలో నిందతుడు మలక్పేట్ మూసారాంబాగ్కు చెందిన గూడెం సోలయ్యను అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేశామని అన్నారు. అలాగే జవహార్నగర్ ఠాణా పరిధిలో హోండా యాక్టివాపై వచ్చిన ఓ దుండగుడు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పరారవుతుండగా, బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.