అబిడ్స్, డిసెంబర్ 18 : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టాల్స్ కేటాయింపు కోసం దరఖాస్తుల స్వీకరణ, స్టాల్స్ కేటాయింపు, నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను 46 రోజుల పాటు నిర్వహిస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు రాష్ర్టాల వ్యాపారులు విచ్చేసి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. కాగా ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉండటంతో స్టాల్స్ పొందేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.
జనవరి ఒకటి వరకు స్టాల్స్ ఏర్పాటయ్యేలా చర్యలు
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రారంభిస్తారు. అయితే ప్రతి సంవత్సరం నుమాయిష్ ప్రారంభమైన పది రోజుల వరకు స్టాల్స్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ సంవత్సరం నుమాయిష్ ప్రారంభమయ్యే నాటికి 80 శాతం స్టాల్స్ నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా సొసైటీ మేనేజ్మెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే స్టాల్స్ కేటాయింపులు ప్రారంభం కావడంతో స్టాల్స్ పొందిన వారు తమ స్టాల్స్ను అనువుగా తీర్చిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
నుమాయిష్ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. స్టాల్స్ కేటాయింపు, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్టాల్స్ పొందేందుకు వివిధ రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 1వ తేదీ నాటికి 80 శాతం స్టాల్స్ అందుబాటులోకి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నుమాయిష్ను పకడ్బందీగా నిర్వహించేందుకు భద్రతా వ్యవస్థను పటిష్ట పరుస్తున్నాం. ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు చేస్తాం.
-అశ్విన్ మార్గం, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు