అమీర్పేట్, జనవరి 21: సనత్నగర్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా పలు అభివృద్ధి పనులు ఉన్నాయని, నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా చూస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రూ.9.60 కోట్ల వ్యయంతో చేపట్టిన జీహెచ్ఎంసీ, జల మండలి విభాగాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆయా పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతాయని శుక్రవారం మాసబ్ ట్యాంక్లోని తన ఛాంబర్లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జల మండలి ఎం.డి దాన కిశోర్లతో పాటు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి తలసాని వెల్లడించారు. నియోజకవర్గంలో రూ.35 కోట్ల అంచనాలతో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు పూర్తయ్యాయని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని వెల్లడించారు.
పలు ప్రాంతాల్లో మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల వ్యవస్థ శిధిలావస్థకు చేరుకుందని, త్వరలోనే ఈ పాత పైపులైన్లను నూతన పైపులైన్లతో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. మరెక్కడా లేని విధంగా సనత్నగర్ డివిజన్లో 55 పార్కులు ఉన్నాయని, వీటిలో పచ్చదనం పెంపొందించేందుకు అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఎన్డీపీ సీఈ వసంత, జల మండలి ఈఎన్సీ కృష్ణ, జీహెచ్ఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈ సుదర్శన్, యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రశేఖర్, డీఈ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ పాల్గొన్నారు.