తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ 500లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 20 రోజులు కావస్తున్నది. దీని గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. ప్రజలు మాత్రం రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సబ్సిడీ గ్యాస్ కోసం తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నది. ఈ పథకానికి సంబంధంలేని కేవైసీ అప్డేట్ కోసం గ్యాస్ ఎజెన్సీల ముందు భారీగా జనం బారులు తీరుతుంటేనే అర్థమవుతున్నది పరిస్థితి ఏవిధంగా ఉందో.
అయితే.. సబ్సిడీ గ్యాస్కు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధి విధానాలు రూపొందించ లేదని, దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని హైదారాబాద్ గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్కుమార్ వెల్లడించారు. కేవైసీ అప్డేట్ చేసినవారికి మాత్రమే సబ్సిడీ గ్యాస్ వస్తుందని జరిగే ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. ఇది కేవలం రూమర్ మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవంబర్ నుంచే కేవైసీ అప్డేట్ జరుగుతున్నదని, దీనికి, సబ్సిడీ గ్యాస్ పథకానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన విధివిధానాల ప్రకారమే లబ్దిదారులకు గ్యాస్ సబ్సడీ లభిస్తుందని అశోక్ కుమార్ చెప్పారు.