కవాడిగూడ, జనవరి 23: వొడాఫోన్ ప్రకటనల ద్వారా అత్యంత ప్రాచుర్యం పొందిన విదేశీ జాతి పగ్స్ కుక్కలు నగర వాతావరణంలో ఇమడలేక శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్నాయని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్ (పెటా) ఇండియా ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్లో పెటా సమన్వయ కర్త ఉత్కర్ష్ గార్గ్ మాట్లాడుతూ..
పగ్స్ వంటి విదేశీ బ్రాచైసెఫాలిక్ శునకాల(పొట్టి పుర్రె, చదునైన ముఖం ఉన్నవి)తో పాటు ఫ్రెంచ్, ఇంగ్లిష్ బుల్డాగ్స్, పెకింగీస్, బోస్టన్ టెర్జియర్స్, బాక్సర్స్, కావాలియర్ కింగ్ చార్లెస్ స్పానియెల్స్, షిహ్ ట్జుస్ జాతులు బ్రాచైసెపలిక్ సిండ్రోమ్ వంటి ప్రాణాంతక రోగాలు సులువుగా వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తగానే ఉన్నట్టుండి ఉక్కిరి బిక్కిరి అవడం, గురక రావడం, శబ్దం చేసి శ్వాస తీసుకోవడం వంటి సమస్యలతో సతమతమవుతాయని చెప్పారు.
భిన్న ముఖ ఆకృతి కలిగిన ఇటువంటి శునకాలకు సరైన శ్వాస అందక పోవడంతో వాటి జీవితకాలం కూడా తగ్గిపోయి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని పేర్కొన్నారు. చాలా రకాల విదేశీ జాతి కుక్కలకు ఇక్కడి వాతావరణం సరిపడదని వాటిని పెంచడమంటే ఆ శునకాలను ఇబ్బంది పెట్టడమేనని అభిప్రాయపడ్డారు.
అందువల్ల మన వాతావరణంలో ఇమడగలిగిన దేశీయ కుక్కలనే పెంచుకోవాలని, దత్తత తీసుకోవాలని విన్నవించారు. ఈ సందర్భంగా పెటా సభ్యులు.. పగ్స్ దుస్తులు ధరించి ఆక్సిజన్ సిలిండర్లతో శ్వాస తీసుకుంటూ ఆ జాతి శునకాల ఆరోగ్య పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించారు.