పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రిపేర్ కావాలి. పట్టుదలతో చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువే. ఉత్తరప్రదేశ్లాంటి పెద్ద రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ రాలేదు. సీఎం కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లను వినియోగించుకొని ఉద్యోగం సాధించాలి. తెలంగాణ ఉద్యమం, జిల్లాలు, పండుగలపై అవగాహన పెంచుకోవాలి. టీఎస్ బీపాస్, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది.
సమాజం కోసం ఉపయోగపడగలమనే భావనతో సిద్ధమైతే పట్టుదలగా చదవగలమని, విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రిపేర్ అవ్వాలని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత స్పష్టం చేశారు. రివర్స్ ఇంజినీరింగ్ మెథడ్ను అనుసరిస్తే ప్రతి అంశంపై లోతైన పరిజ్ఞానం అందుతుందన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన నిపుణ ‘కొలువు-గెలువు’ కార్యక్రమానికి కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ డైరెక్టర్ డా.సీఎస్ వేప, నమస్తే తెలంగాణ చీఫ్ ఆఫ్ బ్యూరో ఓరుగంటి సతీశ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లవరపు బాలలత మాట్లాడుతూ ఒక అంశాన్ని గురించి తెలుసుకునే సమయంలో దానికి సంబంధించిన పూర్వపు, సంబంధిత అంశాలపై లోతుగా వెళ్లి తెలుసుకునే పద్ధతే రివర్స్ ఇంజినీరింగ్ మెథడ్ అన్నారు.
సామాజిక బాధ్యతగా నమస్తే తెలంగాణ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రతి జిల్లాలో ఎక్కువ మంది పోలీసు, గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారన్నారు. 80వేల ఉద్యోగాల్లో ఒక ఉద్యోగాన్ని సాధించడం ఎలా అనే వారి కోసం ఇలాంటి అవగాహన సదస్సులు ఉపయోగపడుతున్నాయన్నారు. ఏ పోటీ పరీక్ష అయినా బేసిక్గా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ భాగాలపై పూర్తిస్థాయిలో అవగాహన సాధించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందించే పాఠశాలస్థాయి పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు, మార్కెట్లో అందుబాటులో ఉండే విలువైన పుస్తకాల ద్వారా పట్టు సాధించాలి. ‘నమస్తే తెలంగాణ’లో ముద్రించే నిపుణలో నాలుగు పేజీల పోటీ పరీక్షల సమాచారాన్ని కట్చేసి పెట్టుకొని ప్రిపేర్ కావడం ద్వారా మంచి అవగాహనను సాధించవచ్చు. పత్రికల ద్వారా పొందే సమాచారం పోటీ పరీక్షల్లో కీలకంగా ఉపయోగపడుతుంది. అభ్యర్థులు గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. మన కోసం మనం చదవడం, ఉద్యోగం సాధించడం అనే భావన కన్నా పది మంది కోసం, సమాజం కోసం మనం ఉపయోగపడగలం అనే భావనతో ఉద్యోగం కోసం సిద్ధమైతే పట్టుదలగా చదవగలుగుతారు. సీఎం కేసీఆర్ ఇంత పెద్ద నోటిఫికేషన్లను ఇస్తున్నందున తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ రాలేదు. జర్నలిస్ట్ అయిన మా తండ్రి తమ కోసం కాకపోయినా సొసైటీ కోసం సివిల్స్ సాధించాలని ఇచ్చిన ప్రోత్సాహం తనను రెండుసార్లు సివిల్స్ విజేతగా నిలిపింది.
– మల్లవరపు బాలలత, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా నైపుణ్యతతో మార్కులు సొంతం చేసుకోవాలి. మార్కులు సాధించాలంటే నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు. నాలెడ్జ్కు స్కిల్స్ తోడైతేనే ఎక్కువ మార్కులు వస్తాయి. అభ్యర్థులు పోటీ పరీక్షల ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా సాగించాలి. కేసీఆర్ ప్రభు త్వం ఇచ్చిన భారీ నోటిఫికేషన్తో వేసవిలో సైతం జాబ్ల జడివాన కురుస్తున్నది. పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం నమస్తే తెలంగాణ దినపత్రిక కృషి చేయడం అభినందనీయం. సీఎం కేసీఆర్ అందిస్తున్న మెగా జాబ్స్ నోటిఫికేషన్స్ సందర్భంలో అభ్యర్థులకు ‘నమస్తే తెలంగాణ – తెలంగాణటుడే’ అందిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతున్నందుకు గర్వంగా ఉన్నది.
– డా.సీఎస్ వేప, వేప అకాడమీ, డైరెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం మెగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్న తరుణంలో అభ్యర్థులకు అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహించడం ‘నమస్తే తెలంగాణ’ సామాజిక బాధ్యతగా భావిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సుకు యువత నుంచి చక్కని స్పందన లభిస్తుండడం సంతోషకరం. నమస్తే తెలంగాణ నిపుణ పేరిట రోజూ నాలుగు పేజీల స్టడీ మెటీరియల్తోపాటు వారానికోసారి ప్రత్యేక ఎడిషన్తో అందిస్తున్న సమగ్ర సమాచారాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో సంవత్సరాల పాటు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 80వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఇది మంచి అవకాశం.
– ఓరుగంటి సతీశ్, నమస్తే తెలంగాణ చీఫ్ ఆఫ్ బ్యూరో
అవగాహన సదస్సులో నమస్తే తెలంగాణ నిపుణ తయారు చేసిన భారత దేశ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలకు విశేష ఆదరణ లభించింది. కార్యక్రమం ప్రారంభించక ముందే వచ్చిన ఉద్యోగార్థులు రెండు, మూడు చొప్పున చరిత్రకు సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేయడంతో తర్వాత వచ్చిన వారికి దొరక్కపోవడంతో మళ్లీ తెప్పించాల్సి వచ్చింది. పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం సమగ్రంగా పొందుపర్చడంతో పుస్తకాలకు విశేష ఆదరణ లభించింది.
నమస్తే తెలంగాణ ‘నిపుణ’ ద్వారా ఉద్యోగార్థులను పోటీ ప్రపంచంలో నిలిపేలా కృషి చేస్తున్నది. అనేక వ్యయప్రయాసలకోర్చి నిపుణను నాలుగు పేజీల ద్వారా నమస్తే తెలంగాణ అందిస్తూ వస్తున్నది. గ్రూప్-1, గ్రూప్-2, ఎస్సై, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నిపుణ విలువైన సమాచారాన్ని అందిస్తూ వారు విజయాలు సాధించేలా తోడ్పాటును అందిస్తున్నది.
– టి.గణేశ్, తెలంగాణ పబ్లికేషన్స్ మేనేజర్
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కష్టాన్నే నమ్ముకోవాలి. అదృష్టం అనే మాటను దూరంగా పెట్టాలి. పట్టుదలతో కృషి చేస్తే పోలీసు జాబ్ తప్పక సాధించొచ్చు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న వారికి మెళకువలు, శిక్షణ అందిస్తాం. యువత కోసం ‘నమస్తే తెలంగాణ’ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు.
పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే 100 ప్రశ్నలకు వంద శాతం ప్రిపరేషన్ అవసరం. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు గుడ్డిగా జవాబు పెట్టకూడదు. సరిగ్గా అంచనా వేయాలి. పోటీ పరీక్షల్లో విన్నర్కు, లూసర్కు ఒకటి, రెండు మార్కుల వ్యత్యాసం మాత్రమే ఉంటుందని గుర్తించాలి. ‘నమస్తే తెలంగాణ’లో పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం చక్కని ఆర్టికల్స్ అందిస్తున్నది. ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్పైనే దృష్టి నిలుపాలి. ప్రిపరేషన్ను బోరుగా ఫీల్ కావొద్దు. ఫ్రెండ్స్, సినిమాలు తదితర వ్యాపకాలకు పరీక్ష అయ్యే వరకు దూరంగా ఉండాలి.
– సి.నారాయణరెడ్డి, కలెక్టర్, నిజామాబాద్
సీఎస్ వేప : ప్రస్తుతం సెల్ ఫోన్ లేనిదే ఏ చిన్న పనీ జరగడం లేదు. దాని పాత్ర చాలా పెద్దది. ప్రస్తుతం సెల్ఫోన్ మంచి కన్నా చెడు ప్రభావమే ఎక్కువగా చూపుతున్నది. ముఖ్యంగా పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్లు ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. రోజుకు గంట.. లేదంటే 2 గంటలు మాత్రమే సెల్ఫోన్కు సమయం కేటాయించాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసి చదువుపై దృష్టి పెడితే విజయం మీదే. ఈ విషయంలో కఠినంగా నిర్ణయం తీసుకుని పాటించాలి.
నవీన్కుమార్ : ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా..చదువుకోవడానికి రోజుకు ఐదు గంటల సమయం సరిపోతుందా?
బాలలత : ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే సంకల్పం గొప్పది. మీరు అందరి కన్నా ఎక్కువగా శ్రమిస్తే విజయం మీదే. మీకు లభ్యమయ్యే సమయాన్ని మీకోసం వెచ్చించాలి. నిమిషం కూడా వృథా చేసుకోవద్దు. రోజుకు ఐదు గంటల ఖాళీ సమయాన్ని తదనుగుణంగా నిర్దేశించుకుంటే సక్సెస్ అవుతారు. అవసరమైతే మీలాంటి వాళ్లు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఫాలో అవ్వొచ్చు.
బాలలత : ప్రణాళికాబద్ధంగా చదవడం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ప్రిపరేషన్లో రివిజన్కు, ప్రాక్టీస్కు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. వారంలో చదివినదంతా ఒకసారి రివిజన్ చేసుకుంటే సక్సెస్ సాధించవచ్చు. గత ప్రశ్నలకు జవాబులు రాసుకోవాలి. మోడల్ పేపర్లతో ప్రాక్టీస్ చేస్తే ఫలితం బాగుంటుంది.
బాలలత : ఉద్యోగం సాధించాలనే కసి మీలో ఉంటే ఏదైనా సాధించొచ్చు. ప్రిలి మ్స్ కోసం సెలవులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందున ప్రిలిమ్స్ స్థాయి పరీక్షలకు కొద్దిగా కష్టపడితే ఎదుర్కోవచ్చు. మెయిన్స్ కోసం తప్పనిసరిగా సబ్జెక్టులపై పట్టు సాధించాలంటే సెలవులపై ఆలోచన చేయాల్సి ఉంటుంది.