NIMS | ఖైరతాబాద్, ఫిబ్రవరి 22 : ప్రమాదంలో వెన్నుపూస విరిగి వీల్ చైర్కే పరిమితమైన ఓ వ్యక్తికి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నగరానికి చెందిన అంజయ్య (42)కు రెండున్నర సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయింది. కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానకు తరలించగా.. రాడ్స్, స్క్రూలను అమర్చారు. కానీ ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో వీల్ చైర్కే పరిమితమయ్యాడు. తీవ్ర నొప్పితో పాటు కదలడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో నిమ్స్ దవాఖానలో చేర్పించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన న్యూరోసర్జరీ వైద్యులు స్పైనల్ కార్డ్ స్టిములేటర్ పరికరాన్ని అమర్చేందుకు నిర్ణయించారు.
న్యూరోసర్జన్లు ప్రొఫెసర్ సుచందా భట్టాచార్జి, డాక్టర్ రామనాధ రెడ్డి, డాక్టర్ స్వప్న, డాక్టర్ అవినాశ్ బృందం శస్త్రచికిత్స నిర్వహించి స్పైనల్ కార్డ్ స్టిములేటర్ పరికరాన్ని విజయవంతంగా అమర్చారు. ఈ చికిత్స ద్వారా చచ్చుబడిన కాళ్లలో చలనం వస్తుందన్నారు. నొప్పి బాధలు తగ్గుతాయని వైద్యులు తెలిపారు. న్యూరో సర్జరీ విభాగం ఈ తరహా శస్త్రచికిత్స రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహించినట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులను అభినందించారు.