ఖైరతాబాద్, మార్చి 8: గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువకుడికి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నగరానికి చెందిన పూజారి అనిల్ కుమార్ (19) కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్ దవాఖానలో చేరగా, పరీక్షించిన వైద్యులు గుండె మార్పిడి మాత్రమే పరిష్కారమని చెప్పారు. దీంతో గుండె మార్పిడికోసం జీవన్దాన్లో దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన 24 ఏండ్ల యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురాయ్యడు.
అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి బ్లడ్ గ్రూప్ అనిల్ కుమార్ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ అయ్యింది. దీంతో గ్రీన్ చానెల్ ద్వారా గుండెను నిమ్స్ దవాఖానకు వైద్యులు తరలించారు. కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అరమరేశ్ బాబు నేతృత్వంలో వైద్యుల బృందం శస్తచ్రికిత్స నిర్వహించి విజయవంతంగా గుండెమార్పిడి చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఆనిల్ కుమార్కు పూర్తిగా ఉచితంగా శస్తచ్రికిత్స నిర్వహించామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ఈ సందర్భంగా తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు..మంత్రి దామోదర రాజనర్సింహ
అవయవ మార్పిడి విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. అవయవాల అక్రమ రవాణా, సేకరణ, మార్పిడులపై కఠిన శిక్షలు పడేలా కొత్త నిబంధనలు ఉండబోతున్నాయన్నారు. గాంధీ దవాఖానలో అధునాతన ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగాన్ని అందుబాటులో తీసుకువస్తున్నామన్నారు. యువకుడికి గుండె దానం చేసిన అవయవదాత కుటుంబసభ్యులను మంత్రి అభినందించారు.