బంజారాహిల్స్, ఆగస్టు 26: విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి గూడపాటి సీతారామాస్వామి జీవిత చరిత్ర ఆధారంగా రచించిన ‘నిలువెత్తు నిజాయితీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో నిర్వహించారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మురళీమోహన్ తదితరుల చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సీతారామస్వామి జీవితం నేటితరం యువతకు, భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వాహణలో నిజాయితీతో ఉండటం వల్ల సమాజానికి మేలు జరుగుతున్నదన్నారు. నేటి తరంలో నిజాయితీ అనే మాటకు అర్థం లేకుండా పోతున్నదన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారితో పాటు వారితో కలిసి పనిచేసే అధికారులు నిజాయితీగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత సత్యనారాయణ రావు, జయప్రకాష్ నారాయణ్, రమేష్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు పాల్గొన్నారు.